తెలంగాణ

telangana

సైబర్​ నేరగాళ్లు మీ డబ్బులు దోచుకున్నారా? ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసా? - How To File Cyber Crime Complaint

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 3:45 PM IST

How To File A Cyber Crime Complaint : టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్​లైన్ మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సైబర్​ నేరగాళ్లు విషింగ్‌ స్కామ్, ఫిషింగ్‌, మాల్​వేర్‌ అటాక్‌ లాంటి పలు విధానాలు ఉపయోగించి యూజర్ల డేటాను, వారి ఖాతాలోని డబ్బులను దోచుకుంటున్నారు. అందుకే ఈ ఆర్టికల్​లో సైబర్​ నేరాలపై పోలీసులకు, సైబర్​ క్రైమ్​ సెల్​కు ఎలా రిపోర్ట్ చేయాలో తెలుసుకుందాం.

How to Register Cyber Crime Complaint in Online
How To Report Online Scams In India (ETV Bharat)

How To File A Cyber Crime Complaint :ప్రస్తుత కాలంలో దాదాపు ఆర్థిక లావాదేవీలు అన్నీ ఆన్​లైన్​లోనే జరిగిపోతున్నాయి. బ్యాంకింగ్, నగదు చెల్లింపులు, ప్రయాణికుల టికెట్​ బుకింగ్​లు వంటివి అన్ని ఆన్​లైన్​లోనే చేసేస్తున్నాం. స్మార్ట్​ఫోన్‌ ద్వారా ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చుకుంటున్నాం. సాంకేతికత అభివృద్ధి మంచిదైనప్పటికీ, దాని వల్ల కొన్ని నష్టాలు కూడా ఏర్పడుతున్నాయి. ప్రస్తుత సాంకేతిక యుగంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు పలు రకాలుగా ప్రజలను మోసగిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లలోని నగదును కొల్లగొట్టేస్తున్నారు. వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. అందుకే ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే, మనకు కూడా వాటిపై ఓ మంచి అవగాహన ఉండాలి. అందుకే ఈ ఆర్టికల్​లో ఆన్​లైన్ మోసాలపై ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకుందాం.

కంప్యూటర్, ల్యాప్​టాప్, ట్యాబ్లెట్, మొబైల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ డివైజ్​లతో చట్టవిరుద్ధంగా పాల్పడే చర్యలను ఆన్​లైన్ మోసాలు అంటారు. వీటిని చేయడం చట్టప్రకారం నేరం. ప్రస్తుత కాలంలో సైబర్ కేటుగాళ్లు క్రెడిట్ కార్డు, బ్యాంకు అకౌంట్ హ్యాకింగ్, ఫిషింగ్, విషింగ్ స్కామ్​లకు పాల్పడి ప్రజల డబ్బును కొల్లగొడుతున్నారు. ఇలా సైబర్ దాడికి గురైప్పుడు భారత ఐటీ చట్టం ప్రకారం, దేశంలోని ఏ సైబర్ సెల్​లోనైనా ఫిర్యాదు చేయవచ్చు.

1. డెబిట్/ క్రెడిట్ కార్డు మోసానికి గురైతే ఇలా చేయండి!
సైబర్‌ నేరగాళ్లు బ్యాంకింగ్‌, డెబిట్/ క్రెడిట్ కార్డు వివరాలను తస్కరించి మోసపూరిత లావాదేవీల ద్వారా డబ్బును కాజేస్తుంటారు. ఫిషింగ్‌ లింక్స్‌, హ్యాకింగ్‌ వంటి మార్గాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారు. ఒకవేళ ఈ తరహా బ్యాంకింగ్‌ మోసాల బారిన మీరు పడితే, పోలీసులకు ఫిర్యాదు చేయడానికంటే ముందు మీ డెబిట్/ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయాలి. ఆ తర్వాత మీ బ్యాంకుకు సమాచారం అందించాలి. బ్యాంకు కస్టమర్ కేర్​కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. తరువాత పోలీస్​ స్టేషన్​లో ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలి.

2. ఇవి సిద్ధంగా ఉంచుకోవాలి!
మీరు సైబర్ క్రైమ్ సెల్​కు ఫిర్యాదు చేసే ముందు, మీ వద్ద అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండేలా చూసుకోవాలి. గత ఆరు నెలల మీ బ్యాంక్ స్టేట్​మెంట్లు, ఎస్​ఎంఎస్​లు​, సైబర్ ఫ్రాడ్స్​ మీకు పంపిన స్పామ్ లింకులు, లావాదేవీకి సంబంధించిన వివరాలు సిద్ధంగా ఉంచుకుని, ఆ తరువాతే ఫిర్యాదు చేయాలి. అలాగే ఐడీ కార్డు, అడ్రస్ ప్రూఫ్​ను కూడా అందజేయాల్సి ఉంటుంది. ఈ విధంగా తగు పత్రాలతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

3. ఆన్​లైన్/ ఆఫ్​లైన్ ఫిర్యాదు
ఎవరైనా ఆన్​లైన్ మోసానికి గురైతే భారత ఐటీ చట్టం ప్రకారం, దేశంలోని ఏ సైబర్ క్రైమ్ సెల్​కైనా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే https://cybercrime.gov.in/ వెబ్​సైట్​ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. 155260 నంబరుకు ఫోన్ చేసి ఆన్​లైన్ మోసానికి సంబంధించిన ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఈ నంబరు పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది.

4. పోలీస్​ కంప్లైంట్​
ఆన్​లైన్ మోసానికి గురైనవారు దేశంలోని ఏ సైబర్ సెల్​లో అయినా ఫిర్యాదు చేయవచ్చు. అందుకు వీలుకాకపోతే సమీపంలోని పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. కచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యేటట్లు చూసుకోవాలి. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే, నగర కమిషనర్ లేదా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్​ను సంప్రదించాలి.

ఈ విషయాలు గుర్తించుకోండి!
ఆన్​లైన్ మోసానికి సంబంధించిన ఫిర్యాదు లెటర్​ను సైబర్ క్రైమ్ సెల్ హెడ్​కు పంపాల్సి ఉంటుంది. అందులో మీ పేరు, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబరు వంటి వ్యక్తిగత వివరాలను పొందుపర్చాలి. ఆన్​లైన్ మోసానికి సంబంధించిన నిర్దిష్ట రుజువులను, పత్రాలను సమర్పించాలి. అవే మీ కేసుకు తగిన సాక్ష్యాధారాలుగా ఉపయోగపడతాయి.

72 గంటల్లోగా ఫిర్యాదు చేయాలి!
కస్టమర్ లేదా బ్యాంక్ ప్రమేయం లేకుండా, మాల్​వేర్ సైట్​లు, పబ్లిక్ వైఫై, ఏటీఎం స్కామర్ల వంటి థర్డ్ పార్టీల కారణంగా ఆన్​లైన్ మోసం జరిగితే 72 గంటల్లోగా బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. అప్పుడే మీకు పరిహారం అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోసం జరిగినట్టు గుర్తించిన వెంటనే మీరు బ్యాంకు, సైబర్ క్రైమ్ సెల్​కు ఫిర్యాదు చేయడం తప్పనిసరి. ఆలస్యం చేస్తే మీరే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

ఇంకా ITR ఫైల్ చేయలేదా? గడువు ముంచుకొస్తోంది - త్వరపడండి! - ITR Filing 2024 Deadline

టూ-వీలర్​పై సాహస యాత్రలు చేయాలా? ఈ టాప్​-10 ఆఫ్​ రోడ్​ బైక్​లపై ఓ లుక్కేయండి! - Best Off Road Bikes In India

ABOUT THE AUTHOR

...view details