Supreme Court Hearing on Doctor Murder Case :బంగాల్ వైద్యురాలిపై అత్యాచారం, హత్యను భయంకరమైన చర్యగా సుప్రీం కోర్టు అభివర్ణించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జాప్యంపై బంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యంగా నమోదు చేశారని ప్రశ్నించింది. బంగాల్ ప్రభుత్వం, ఆసుపత్రి అధికారులు ఏమి చేస్తున్నారని మండిపడింది. ఈ సందర్భంగా మహిళలు, యువ వైద్యుల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. డాక్టర్పై అత్యాచార ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, మంగళవారం విచారించింది. ఈ కేసులో ఈనెల 22లోపు ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని బంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
టాస్క్ఫోర్స్ ఏర్పాటు
దేశవ్యాప్తంగా డాక్టర్లు, మహిళల రక్షణకు జాతీయ స్థాయి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. 10 మంది సభ్యులతో కూడిన ప్రముఖ డాక్టర్లు, నిపుణులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు వెలువరించారు. సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్.కె.శరిన్ అధ్యక్షతన జాతీయ టాస్క్ఫోర్స్ ఏర్పాటు కానుంది. అన్ని ఆస్పత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కమిటీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. టాస్క్ ఫోర్స్లో తెలుగు వారికి చోటు కల్పించింది. ఏఐజీ హాస్పిటల్స్ ఛీఫ్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ను సభ్యులుగా నియమించింది.