తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాఘ పూర్ణిమ వేళ కుంభమేళాకు పోటెత్తిన భక్తులు- హెలికాప్టర్లతో పూలవర్షం - MAHA KUMBH 2025 DEVOTEES

మాఘ పూర్ణిమ వేళ కిక్కిరిసిన ఘాట్​లు- త్రివేణీ సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు

Maha Kumbh 2025 Devotees
Maha Kumbh 2025 Devotees (ANI)

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2025, 10:43 AM IST

Updated : Feb 12, 2025, 10:56 AM IST

Maha Kumbh 2025 Devotees : మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళా భక్తజన సంద్రమైంది. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో త్రివేణీ సంగమంలో ఘాట్‌లన్నీకిక్కిరిసిపోతున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల వరకు 73 లక్షలకుపైగా ప్రజలు పుణ్యస్నానాలు చేశారని ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ పుణ్యస్నానాలు చేసినవారి సంఖ్య 46.25 కోట్లు దాటిందని ప్రకటించింది.

మాఘపూర్ణిమ పర్వదినం సందర్భంగా మంగళవారం నుంచి కొనసాగుతున్న భక్తుల రద్దీ, బుధవారం నాటికి మరింత పెరిగిపోయింది. భక్తులపై హెలికాఫ్టర్‌ నుంచి పూలవర్షం కురిపించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లఖ్‌నవూ నుంచి ఏర్పాట్లను, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, పార్కింగ్​కు కేటాయించిన స్థలాలను మాత్రమే ఉపయోగించాలని మహాకుంభమేళా పరిపాలన యంత్రాంగం భక్తులను అభ్యర్థించింది.

మాఘపూర్ణిమ స్నానంతో నెలరోజుల దీక్షకు కల్పవాసీలు ముగింపు పలికారు. ఉదయం 6 గంటలకు వరకూ 10 లక్షల మంది కల్పవాసీలు సహా 73.60 లక్షల మందికిపైగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించిన పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వసంత పంచమి కంటే ఎక్కువగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కుంభ్ SSP రాజేష్ ద్వివేది చెప్పారు. రద్దీ నిర్వహణ క్లిష్టంగా ఉన్న ప్రదేశాలలో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించినట్లు ప్రయాగ్‌రాజ్‌ ఏడీజీ భాను భాస్కర్ తెలిపారు. టోల్ ప్లాజాలు, పొరుగు జిల్లాల అధికారుల నుంచి కుంభమేళాకు వచ్చే వాహనాల సంఖ్యను సేకరించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ, కుటుంబ సమేతంగా మంగళవారం మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ముకేశ్‌ అంబానీతో పాటు కుటుంబ సభ్యులు కూడా స్నానం ఆచరించారు. అరైల్‌లోని పర్‌మార్థ్‌ త్రివేణి పుష్ప్‌లో జరిగిన యజ్ఞంలో ఆయన కుటుంబంతో పాల్గొన్నారు. తదుపరి పారిశుద్ధ్య కార్మికులు, పడవలు నడిపేవారికి లైఫ్‌జాకెట్లు, స్వీట్లు, పళ్లు, హైజీన్‌ కిట్‌లతో పాటు బహుమతులను అంబానీ కుటుంబం అందించింది.

Last Updated : Feb 12, 2025, 10:56 AM IST

ABOUT THE AUTHOR

...view details