ED Summons To Delhi CM :దిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల 21న సెంట్రల్ దిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు రావాలని పేర్కొంది. కాగా, ఇలా కేజ్రీవాల్కు ఈడీ సమన్లు ఇవ్వడం ఇది వరుసగా తొమ్మిదోసారి.
మనీలాండరింగ్ నిరోధక చట్టం- పీఎంఎల్ఏ కింద కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు వీలుగా మరోసారి సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈడీ జారీ చేస్తున్న సమన్లు చట్టవిరుద్ధమని పేర్కొంటూ కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు. గతంలో ఈడీ జారీ చేసిన సమన్లకు ఆయన నుంచి స్పందన లేకపోవడం వల్ల దిల్లీ కోర్టులో ఈడీ రెండు ఫిర్యాదులు నమోదు చేసింది. దీనిపై శనివారం విచారణ సందర్భంగా కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. విచారణ జరిపిన చీఫ్ మెట్రోపాలిటన్ న్యామేజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. అయితే మరుసటి రోజే తాజాగా మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
రెండో మనీలాండరింగ్ కేసులో నోటీసులు
మరోవైపు దిల్లీ జల్ బోర్డు (డీజేబీ)తో సంబంధం ఉన్న మరో మనీలాండరింగ్ కేసులో కూడా కేజ్రీవాల్కు విడిగా మరోసారి నోటీసులు పంపింది ఈడీ. ఈ కేసుకు సంబంధించిన విచారణను మార్చి 18న ఎదుర్కోవాలంటూ సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు దిల్లీ సీఎంను జైలుపాలు చేయాలని బీజేపీ చూస్తోందని దిల్లీ ఆర్థిక మంత్రి అతిశీ ఆరోపించారు.