తెలంగాణ

telangana

'ప్రకృతి విలయంపై వారం ముందే హెచ్చరించినా పట్టించుకోని కేరళ!' - Wayanad Landslide 2024

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 3:20 PM IST

Updated : Jul 31, 2024, 5:06 PM IST

Wayanad Landslide 2024 : కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయన్న విషయంపై కేరళను ముందే హెచ్చరించామని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే షా వ్యాఖ్యలపై స్పందించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​. ఇలాంటి ఆరోపణలకు ఇది సమయం కాదని చెప్పారు.

wayanad landslide 2024
wayanad landslide 2024 (Sansad TV)

Wayanad Landslide 2024 :కేరళ వయనాడ్​లో జరిగిన కొండచరియలు విరిగిపడిన ప్రమాదంపై బుధవారం పార్లమెంట్​ వేదికగా స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయన్న విషయంపై కేరళను ముందే హెచ్చరించామని స్పష్టం చేశారు. ఈ ముప్పు గురించి జులై 23నే అప్రమత్తం చేశామని కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పౌరులను సకాలంలో తరలించలేదని ఆరోపించారు. భారీ వర్షాలు కురవగానే తొమ్మిది ఎన్​డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఆ రాష్ట్రానికి పంపించామని వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు.

"ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నింటిపైనా ఓ స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నా. 2014 తర్వాత హెచ్చరిక వ్యవస్థపై ప్రభుత్వం సుమారు రూ.2వేల కోట్లను ఖర్చు చేసింది. ఈ వ్యవస్థను 2016, 2023లో ఆధునీకరించాం. ప్రపంచంలోనే ఆధునిక హెచ్చరిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. వారం రోజుల ముందే ప్రమాదాన్ని గుర్తించే 4 దేశాల్లో భారత్​ ఒకటి. కేంద్ర ప్రభుత్వం జులై 23న కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇది ప్రమాదం జరగడానికి సుమారు వారం రోజుల ముందే ఇచ్చాం. ఆ తర్వాత జులై 24, 25 తేదీల్లో మరోసారి ఇచ్చాం. జులై 26న 20 సెంటీమీటర్ల భారీ వర్షం కురవనుందని, ఫలితంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించాం. భారీగా బురదప్రవాహం వస్తుందని, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని చెప్పాం. అందుకోసమే జులై 23నే సుమారు 9 ఎన్​డీఆర్ఎఫ్​ బృందాలను కేరళకు తరలించాం. కానీ కేరళ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిందా? ఒకవేళ తరలిస్తే ఇంతమంది ప్రజలు ఎలా మరణించారు?"
--అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

షా వ్యాఖ్యలపై స్పందించిన కేరళ సీఎం
కేరళకు ముందే హెచ్చరికలు జారీ చేశామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించారు సీఎం పినరయి విజయన్​. ఇలాంటి ఆరోపణలకు ఇది సమయం కాదని చెప్పారు. విపత్తుకు ముందు వయనాడ్​కు ఎలాంటి రెడ్​ అలర్ట్​లు జారీ చేయలేదని తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 144 మృతదేహాలను వెలికితీశామని విజయన్ తెలిపారు. మరో 191 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. 5,592మందిని రక్షించామని, అందులో 200మందికి పైగా ఆస్పత్రిలో చేరారని వివరించారు. కాగా ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 184కు పెరిగింది.

మరోవైపు వయనాడ్​లో కొనసాగుతున్న సహాయక చర్యలను వేగవంతం చేసింది సైన్యం. ఇప్పటివరకు సుమారు 70 మృతదేహాలను వెలికితీశామని, మరో వెయ్యి మందికిపైగా ప్రజలను రక్షించామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. సుమారు 300 ఇళ్లు ధ్వంసమయ్యాయని, అందులోని మృతదేహాలను వెలికితీశామని బ్రిగేడర్​ అర్జున్​ సెగన్​ తెలిపారు.

కేరళ విషాదంలో 174 చేరిన మృతుల సంఖ్య- ప్రమాదంలో గాయపడ్డ మంత్రి వీణా జార్జ్​ - Wayanad Landslides
వయనాడ్ విపత్తు నుంచి కుటుంబాన్ని కాపాడిన 'ఆవు'- లేకుంటే అంతా మట్టిలోనే! - Wayanad landslides

Last Updated : Jul 31, 2024, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details