BJP Strategy In Delhi Assembly Election :దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ప్రధాన పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలతో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రచారం చేస్తుండగా, 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దిల్లీ పీఠం కైవసం చేసుకోవాలని బీజేపీ తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మూడు విడతల్లో మేనిఫెస్టో ప్రకటించిన కమలం పార్టీ ఎన్నడూ లేనంతగా హామీల వర్షం కురిపించింది. పేద కుటుంబాలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, గర్భిణీలకు 21 వేల ఆర్థిక సాయం, అటల్ క్యాంటిన్లతో 5 రూపాయలకే భోజనం వంటి హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తోంది.
బూత్ నుంచి పక్కా ప్రణాళిక!
దిల్లీలో విజయం కోసం బీజేపీ బూత్ స్థాయి నుంచే పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది. ప్రతి బూత్లో కనీసం 50శాతం ఓట్లు సాధించేలా కార్యకర్తలకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అసెంబ్లీ స్థాయిలో గతంలో సాధించిన కంటే 20 వేల ఓట్లను అధికంగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అధిష్ఠానం దిశా నిర్దేశం చేసింది. గత కొన్ని నెలలుగా బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను బీజేపీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పార్టీ అనుకూల, వ్యతిరేక ఓటర్లపై కచ్చితమైన అంచనాకు వస్తోంది. తద్వారా వ్యతిరేక ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు వారితో మంతనాలు జరుపుతోంది.
'దిల్లీ విచ్చేయండి- మాకే ఓటేయండి'
కొవిడ్ సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది దిల్లీ వదలి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఓటర్ల జాబితా ప్రకారం పార్టీ కార్యకర్తలు వారందరికీ ఫోన్లు చేసి ఓటు వేసేందుకు పిలుస్తున్నారు. అవసరమైతే రవాణా ఖర్చులు తామే భరిస్తామని చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చి దిల్లీలో ఉంటున్న ప్రజలపై బీజేపీ దృష్టి సారించింది. వారి ఓట్లను చాలా కీలకంగా భావించిన పార్టీ అధిష్ఠానం ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను ప్రచారకర్తలుగా నియమించింది. రాజధాని దిల్లీలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు జీవిస్తుంటారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి వలస వెళ్తుంటారు. ఈ ఓటర్లందర్నీ తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.