Baba Bawandar Bike Tour : పొగాకు, బాణసంచా, అగరుబత్తీల ఉత్పత్తులపై దేవుళ్ల చిత్రాలను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ బాబా బావందర్ దేశవ్యాప్తంగా బైక్ రైడ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్లోని నైనీతాల్ జిల్లాలోని నైనా దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని భక్తులకు దేవుళ్ల చిత్రాలు ఉన్న వస్తువుల వినియోగంపై అవగాహన కల్పించారు.
హిందూ సమాజానికి చెందిన వారే హిందూ దేవుళ్లను అవమానిస్తున్నారని బావందర్ బాబా ఆవేదన వ్యక్తం చేశారు. దేవుళ్ల చిత్రాల దుర్వినియోగంపై అవగాహన కల్పించటానికి దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ మతానికి చెందిన దేవుళ్లు, దేవతల చిత్రాలను అవమానించరాదని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 28, 29 చెబుతుందని బాబా వెల్లడించారు. ఆర్టికల్ 295 సైతం మతవిశ్వాసాలను అవమానించరాదని తెలియజేస్తుందన్నారు. అయితే, ఆయా వ్యాపార సంస్థలు మాత్రం దేవతల చిత్రాలను తమ వ్యాపార ప్రకటనల కోసం వాడుకొని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల చిత్రాలను వాడటం వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు.
''దేశవ్యాప్తంగా పొగాకు, బాణసంచా, అగరుబత్తీలతో పాటు వివిధ వస్తువులపై దేవుళ్ల చిత్రాలను ముద్రిస్తున్నారు. అయితే, ప్రజలు దేవతల చిత్రాలతో ఉన్న ఆ వస్తువులను ఉపయోగించిన అనంతరం చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. అంటే మనమే మన దేవతలను అవమానిస్తున్నాం. ఇలాంటి వాటిపై అవగాహణ కల్పించేందుకు ఇప్పటివరకు, దేశంలోని 25 రాష్ట్రాల్లో బైక్పై పర్యటించాను. సుమారు లక్షా 11 వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేశాను. ఇప్పటికైనా పొగాకు, క్రాకర్లు, అగరుబత్తీలతో పాటుగా ఇతర వస్తువుల ప్యాకింగ్లపై దేవతల చిత్రాలను తొలగించాలి'' అని డిమాండ్ చేశారు.