ABPMJAY Scheme Beneficiaries :ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్'(AB-PMJAY) పథకం కింద ప్రయోజనం పొందే లబ్దిదారుల సంఖ్యను వచ్చే మూడేళ్లలో రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. అలాగే 70ఏళ్లు పైబడిన వారిని ఈ పథకం కిందకు తీసుకురావాలని, ఆరోగ్య బీమా కవరేజీని ఏడాదికి రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నేషనల్ హెల్త్ అథారిటీ లెక్కల ప్రకారం, ఈ ప్రతిపాదనలు ముందుకు సాగితే ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.12,076 కోట్ల భారం పడుతుందని అంచనా.
వైద్య ఖర్చులు చాలా కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని, ఆయుష్మాన్ భారత్ పథకం కింద లబ్ధిదారులను రెట్టింపు చేస్తే, దేశంలోని మూడింట రెండొంతులకు పైగా జనాభాకు ఆరోగ్య రక్షణ కల్పించొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, త్వరలో కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో దీనికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉందని సమాచారం.
లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఈ పథకం కోసం కేటాయింపులను రూ.7,200 కోట్లకు పెంచింది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్(PM-ABHIM) కోసం రూ.646 కోట్లు కేటాయించింది.
'70ఏళ్లు పైబడిన వారికి ఉచిత వైద్యం'
ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, 70ఏళ్లు పైబడిన వృద్ధులందరినీ ఆరోగ్య బీమా కిందకు తీసుకురానున్నామని, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఉచిత చికిత్స అందించనున్నామని తెలిపారు. 70ఏళ్లు పైబడిన వారితో కలిపి ఈ పథకం కింద మరో 4-5కోట్ల మంది లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.