స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా వరంగల్ నగరంలో ప్రధాన రోడ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. తొలి విడతలో నాలుగు, రెండో విడతలో పదకొండు రహదారులను అభివృద్ధి చేసేందుకు రూ.112 కోట్ల నిధులు వ్యయం చేస్తున్నారు. ఈ ఏడాదిలో 15 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వైట్ ట్యాపింగ్ రోడ్డు, ఆధునిక లైటింగ్, సెంట్రల్ డివైడర్లు, ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేస్తారు. మూడోవిడతలో మరో 20 రోడ్లను స్మార్ట్ రోడ్లుగా అభివృద్ధి పర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
ఎఫ్ఎస్టీపీలు
![](https://assets.eenadu.net/article_img/1a_1189.jpg)
మూడేళ్లుగా అమ్మవారిపేటలో రెండు ఫీకల్ సలడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు(ఎఫ్ఎస్టీపీ) కొనసాగుతున్నాయి. మానవ వ్యర్థాలను ఆధునిక, శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేస్తున్నారు. రోజూ 25 కిలోలీటర్లు(కేఎల్డీలు) మలాన్ని శుద్ధీకరిస్తున్నాయి. వ్యర్థాన్ని మంటల్లో మండించి బొగ్గు చేస్తున్నారు. నీళ్లను శుద్ధీకరించి గ్రీనరీ, మొక్కలకు వినియోగిస్తున్నారు. ఇదే మోడల్తో స్మార్ట్సిటీ ద్వారా రూ.30 కోట్లతో 150 కేఎల్డీ ఎఫ్ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు.
స్వీపింగ్ యంత్రాలు
![](https://assets.eenadu.net/article_img/22CTY2021_2.jpg)
వరంగల్ నగరంలో సుమారు 65 కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారులున్నాయి. ప్రస్తుతం 165 మంది శానిటేషన్ కార్మికులు మాన్యువల్గా రోడ్లను శుభ్రం చేస్తున్నారు. రాత్రివేళల్లో పలుమార్లు ప్రమాదాలు జరగడంతో కార్మికులు గాయపడిన సంఘటనలున్నాయి. స్మార్ట్సిటీ, పట్టణ ప్రగతి నిధులతో స్వీపింగ్ మిషన్లు తెప్పించారు. నెల రోజులుగా రెండు పెద్ద స్వీపింగ్ మిషన్లు వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రహదారులు శుభ్రం చేస్తున్నాయి. మరో పది యంత్రాలు వచ్చాయి. మొత్తం 12 మిషన్లతో ప్రధాన రోడ్లు ఊడ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
ఆధునిక పబ్లిక్ టాయిలెట్లు
![](https://assets.eenadu.net/article_img/22CTY2041_1.jpg)
హైదరాబాద్లో ఉన్నట్లుగా వరంగల్లో ఆధునిక పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులోకి వచ్చాయి. పట్టణ ప్రగతి నిధులతో కొత్తగా 445 సీటర్ల ప్రజామరుగుదొడ్లు నిర్మించారు. కలెక్టరేట్, కాజీపేట, పోచమ్మమైదాన్, నయీంనగర్ నాలుగుచోట్ల లూ కేఫ్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ముందు భాగంలో కాఫీ స్టాల్, ఇతర దుకాణాలు ఉంటాయి. రెండు మొబైల్ షీ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. వీటిలో సైతం ఆధునిక పద్ధతులున్నాయి.
మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాలు
![](https://assets.eenadu.net/article_img/22CTY2051.jpg)
వరంగల్ స్మార్ట్సిటీగా పేరుగాంచింది. మురుగునీరు శుద్ధీకరించేందుకు ఆధునిక విధానాలకు శ్రీకారం చుట్టారు. తొలివిడతలో స్మార్ట్సిటీ ద్వారా రూ.5.50 కోట్లతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 5 ఎంఎల్డీల సీవేజ్ ట్రీట్మెంటు ప్లాంటు ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో వెలువడే మురుగునీరు శుద్ధీకరించి పార్కు, గ్రీనరీకి వాడుతారు. రెండో విడతలో రెడ్డిపురంలో 100 ఎంఎల్డీలు, కాజీపేట బంధం చెరువు వద్ద 15 ఎంఎల్డీలు, ఉర్సు రంగసముద్రం వద్ద 05 ఎంఎల్డీల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం రూ.250కోట్లు కేటాయించారు. ఎన్సీసీ సంస్థకు టెండరు ఖరారైంది.
పార్కులు కళ కళ
అమృత్, పట్టణ ప్రగతి నిధులతో కొత్తగా 17 పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. పార్కుల్లో సైతం ఆధునిక వసతులు ఉండేలా ప్రతిపాదించారు. శివనగర్ మైసయ్యనగర్ మురికివాడలో మైక్రో పిల్లల పార్కు అందుబాటులోకి తెచ్చారు. పట్టణ ప్రకృతివనాల పేరుతో 20 పాత పార్కులను ఆధునికీకరిస్తున్నారు. పిల్లలు, పెద్దల కోసం ప్లే, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తున్నారు. లెగసీ పార్కులు అభివృద్ధి పరుస్తున్నారు.
పబ్లిక్ స్పేస్ లైటింగ్
అభివృద్ధి చెందిన దేశాల్లో ఏర్పాటు చేసినట్లుగా వరంగల్ నగరంలో పబ్లిక్ స్పేస్ లైటింగ్ ఏర్పాటు చేశారు. కాజీపేట ఫాతిమానగర్ కూడలి నుంచి హన్మకొండ అంబేడ్కర్ విగ్రహం వరకు అభివృద్ధి చేసిన స్మార్ట్ రోడ్డులో ఆధునిక లైటింగ్ అందుబాటులోకి తెచ్చారు. 15 స్మార్ట్ రోడ్లలో సైతం పబ్లిక్ స్పేస్ లైటింగ్ ప్రతిపాదించారు. కాజీపేట, హన్మకొండ, వరంగల్ త్రినగరాల్లో కొత్త లైటింగ్ కనువిందు చేయనుంది.