వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా వైద్యసేవలకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు 5 ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించడానికి అనుమతులు రానున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 15న ఎంజీఎంలో కల్పించాల్సిన సౌకర్యాలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్తో ఫోన్లో చర్చించారు.
5 రోజుల తర్వాత ఎంజీఎం ఆసుపత్రిలో అదనపు సౌకర్యాల కల్పన చర్యలు మొదలవగా.. మంగళవారం సాయంత్రం వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
త్వరలోనే అనుమతులు..
ఎంజీఎంలో ఉన్న 200 బెడ్లకు అదనంగా మరో 50 బెడ్లు పెంచామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడున్న వెంటిలేటర్లకు అదనంగా 15 వెంటిలేటర్లు, 5 బైపాస్ యంత్రాలు కూడా వచ్చినట్లు తెలిపారు. వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా 10 వేల ఎన్-95 మాస్కులు, 4 వేల పీపీఈ కిట్లు తెప్పించినట్లు మంత్రి వివరించారు.
కరోనా చికిత్స అందించడానికి నగరంలోని జయ, మాక్స్కేర్, అజరా, ఆదిత్య, అరవింద ముందుకు వచ్చాయన్న ఆయన.. త్వరలోనే వాటికి అనుమతులుల లభిస్తాయని తెలిపారు.
వరంగల్ కేఎంసీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న పీఎంఎస్ఎస్వై ఆసుపత్రిలో ఆక్సిజన్ అమర్చాలని మంత్రి ఈటలను కోరామని దయాకర్రావు పేర్కొన్నారు.
200 పడకల సామర్థ్యం గల ఈ ఆసుపత్రిలో పూర్తిగా కరోనా వైద్యం అందించవచ్చని తెలిపారు. మరిన్ని ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ల కోసం ఆదేశాలు జారీ చేశామన్నారు.
టెలీకాన్ఫరెన్స్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్రెడ్డి, వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, సీపీ ప్రమోద్కుమార్, కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యారాణి, ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీఎంహెచ్వో లలితాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: కరోనా చికిత్సపై శిక్షణ కోసం వైద్యులకు జాతీయ వేదిక