సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారే తమ కూతురిని చంపినట్లు మృతురాలి తల్లి ఆరోపించింది. జిల్లాలోని ఇస్నాపూర్ చెందిన మల్లికార్జునకు, ఘట్పల్లికి చెందిన సునీతకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.
పెళ్లి సమయంలో మూడు లక్షల నగదు, ద్విచక్ర వాహనం, మూడు తులాల బంగారం ముట్ట చెప్పారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్తమామ, ఆడపడుచులు సునీతను శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేసేవారని సునీత తల్లి పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే సునీత మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇదే సమయంలో అత్తమామలు శ్రీశైలం వెళ్లడం.. మృతురాలి శరీరంపై గాయాలు కనబడటం పలు అనుమానాలకు తావిస్తోంది. అత్తింటి వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని సునీత తల్లి, సోదరి ఆరోపిస్తున్నారు. భర్త, ఆడపడుచు, అత్తమామలపై పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ సమావేశం