సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి.. ఆయన సోదరుడిపై పెట్టిన పోస్ట్కు తనకు సంబంధం లేదని సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేవైఎం నాయకులు ఆశిష్ గౌడ్ తెలిపారు. వరద బాధితుల తరఫున పోరాడితే నాలుగు సెక్షన్ల కింద కేసులు పెట్టారని.. వాటిని వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అసలు విచారణ లేకుండా పోలీసులు కేసులు ఎలా నమోదు చేస్తారని ఆశిష్ గౌడ్ దుయ్యబట్టారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొల్పే విధంగా వ్యవహరించారని అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. పటాన్చెరు పోలీసులు సివిల్ కేసుల్లో కలగజేసుకుని అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు చేస్తున్నారని అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ వరద బాధితులకు పరిహారం సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.