పుర ఎన్నికల ప్రచారంలో రెబల్స్ ప్రచారం జోరు అందుకుంది. అధికార పార్టీలకు దీటుగా స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని 16 వార్డు నుంచి తెరాస రెబల్ బుడమాల యాదగిరి డప్పు వాద్యాల మధ్య ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ వార్డులో తెరాస, స్వతంత్ర అభ్యర్థులిద్దరే పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి తరఫున జల్పల్లి మాజీ సర్పంచ్ కట్టెల రాములు ప్రచారం చేస్తున్నారు. తాను తెరాసలో ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వలేదని... ప్రాంత అభివృద్ధి కోసం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినట్లు తెలిపారు.
మున్సిపాలిటీ 10 వ వార్డులోని సాలెహీన్ కాలనీ ప్రాంతంలో ఎంఐఎం అభ్యర్థి ఒమర్ బిన్ అజిజ్ బామ్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ... ఎంఐఎం పార్టీ గుర్తు గాలిపటానికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తాను గెలిచిన తరువాత వార్డులో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.
జల్పల్లి మున్సిపాలిటీలోని 2 వ వార్డులోని బిస్మిల్లాహ్ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి యూనుస్ హందీ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
జల్పల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. 28 వార్డులకు సంబంధించి 84 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ జరిగే రోజు దాదాపు 500 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సఫీఉల్లాహ్ తెలిపారు. మొత్తం 84 పోలింగ్ కేంద్రాల్లో... 18 పోలింగ్ కేంద్రాలు అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు చెప్పారు. అక్కడ ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇవీచూడండి: 'మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలి'