రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం బెదిరింపులకు భయపడి.. రైతులకు అన్యాయం చేయాలని చూస్తోందని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ ఆరోపించారు. తక్షణమే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు పెద్దపల్లి జిల్లా రామగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులతో కలసి నిరసన దీక్ష చేపట్టారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే రైతులకు మేలు జరిగిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. మహిళ, సహకార సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. వాటి ద్వారా ఎంతో మంది రైతులకు లబ్ధి చేకూరేలా చూసిందన్నారు. గ్రామస్థాయిలో రైతుల అభివృద్ధికి పాటు పడిందని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయాలని చూస్తోందని ఆరోపించారు.
గత కొద్ది రోజులుగా.. తెరాస నేతలు, నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం దిల్లీకి వెళ్లి వచ్చిన వెంటనే.. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉంది. కేంద్రానికి భయపడి రాష్ట్ర రైతులకు అన్యాయం చేయకండి.
- మంథని ఎమ్మెల్యే శ్రీధర్.
ఇదీ చదవండి: కొనుగోలు కేంద్రాల ఎత్తివేతను నిరసిస్తూ రాస్తారోకో