నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫుట్బాల్ క్రీడాకారిణి సౌమ్యకు అరుదైన అవకాశం దక్కింది. రేంజల్ మండలం కిసాన్నగర్ తండాకు చెందిన గుగులోత్ సౌమ్య... భారత మహిళా సీనియర్ జట్టుకు ఎంపికైంది. గోవాలో జరిగిన 2 నెలల శిక్షణ శిబిరంలో ప్రతిభ కనబరిచిన సౌమ్యను జట్టుకు ఎంపికచేశారు.
ఈ నెల 14, 24 తేదీల్లో టర్కీతో భారత జట్టు తలపడనుంది. మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన గిరిజన యువతి సౌమ్య... ఫుట్బాల్ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అంచెలంచెలుగా ఎదిగింది.
తెలుగు రాష్ట్రాల నుంచి సీనియర్ ఫుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుని తన కల నిజం చేసుకుంది. ఈ అవకాశం దక్కటం పట్ల సౌమ్యతో పాటు ఆమె కోచ్ నాగరాజ్ హర్షం వ్యక్తం చేశారు.