కరోనా సోకిన వారికి వైద్యం దొరకకపోవడం ఓ సమస్య అయితే.. వైరస్ సోకి మృతి చెందిన వారి మృతదేహాన్ని వైకుంఠధామలకు తీసుకువెళ్లడం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. ఆస్పత్రి బయట అంబులెన్స్ డ్రైవర్లు ఎంత చెబితే అంత కట్టి బయటపడాల్సిందే. మనిషి పోయిన బాధని మించిన కుంగుబాటుకు గురైన బంధువులు, అంబులెన్స్ డ్రైవరు చేతిలో అడిగినంతపెడుతున్నారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఈ వ్యవహారం సర్వసాధారణంగా మారిపోయింది. జనరల్ ఆసుపత్రిలో కేవలం ఒక్క పార్థివదేహ వాహనం ఉండటం వల్ల ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లకు కరోనా కాలంలో ఇది వరంలా మారింది. అంబులెన్స్ నిర్వాహకులు సిండికేట్ అయి సామాన్యుడిని పీక్కు తింటున్నారు.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి రోజు కొవిడ్తో అనధికారికంగా పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. అంబులెన్స్కు ఎక్కడైనా కిలో మీటర్కు రూ.10 నుంచి రూ.12 వరకు వసూలు చేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం దూరంతో సంబంధం లేకుండా.. దండుకొంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంబులెన్స్ కోసం బంధువులు సంప్రదించగా డ్రైవర్లు కరోనా ప్యాకేజీలు చెబుతున్నారు. కరోనా శవాలకు ప్రత్యేక ప్యాకేజీలు.. ఆస్పత్రి నుంచి శ్మశానం వరకు సుమారు 30 వేల రూపాయల వరకు దోచేస్తున్నారు.
శవాన్ని వైకుంఠధామానికి తరలించడం కోసం దూరాన్ని బట్టి 8 వేల నుంచి 15 వేలకు పైగా అంబులెన్స్ డ్రైవర్లు వసూలు చేస్తున్నారు. వైద్యం అందించడమే కాదు కొవిడ్ మృతదేహానికి అంతిమ సంస్కరణలు అందేవరకు ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని మృతుల బంధువులు కోరుతున్నారు.
- ఇదీ చదవండి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు