నారాయణపేట జిల్లా కేంద్రంలో కలెక్టర్ హరిచందన ధరణి పోర్టల్ నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల సేవలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఇందుకోసం తహసీల్దార్లు .. తమ కార్యాలయాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు ఉన్నాయో లేదో సరిచూసుకుని సిద్ధంగా ఉండాలని కలెక్టర్ హరిచందన తెలిపారు.
ధరణి పోర్టల్ను డాటా ఎంట్రీ ఆపరేటర్ల మీద ఆధారపడకుండా తహసీల్దార్లే స్వయంగా చేయాలని కలెక్టర్ సూచించారు. పోర్టల్లో ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు ఎలా సవరించుకోవాలో ముందే చూసుకోవాలన్నారు. అలాగే గ్రామ వీఆర్వోలను భూ సంబంధిత వ్యవహారాలతో పాటు ఇతర పథకాలు, సమాచార సేకరణకు వారిసేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
అనంతరం జిల్లా స్థాయి గ్రీన్ కమిటీతో కలెక్టర్ హరిచందన సమావేశమయ్యారు. ఈ ఏడాదికి ఇచ్చిన టార్గెట్లో భాగంగా మొక్కలు నాటి వాటికి జియో ట్యాగింగ్ ఎంతవరకు చేశారని ఆయా శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న మియావాకి పెట్టి బయో ఫెన్సింగ్ తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ సూచించారు.
ఇదీ చదవండిః పెండింగ్ మ్యుటేషన్లన్నింటినీ తక్షణమే పరిష్కరించాలి: ప్రభుత్వం