రాష్ట్రంలో మిగులు విద్యుత్తు లక్ష్యంగా నల్గొండ జిల్లా వీర్లపాలెం వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల 'యాదాద్రి సూపర్ క్రిటికల్ అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రం' పనులు జోరుగా సాగుతున్నాయి. కొవిడ్ ప్రభావంతో గతేడాది అయిదారు నెలలు పనుల్లో జాప్యమైంది. ఉత్తరాది నుంచి కూలీలు గత నెలాఖరుకు పనుల్లో చేరడంతో తాజాగా విద్యుత్ కేంద్రం నిర్మాణంలో వేగం పెరిగింది. వచ్చే ఏడాది చివరికి మొత్తం ఐదింటిలో ఒక యూనిట్ను ప్రారంభించాలనే లక్ష్యంతో క్షేత్రస్థాయిలో పనులు సాగుతున్నాయి. రూ.28వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును జెన్కో ఆధ్వర్యంలో బీహెచ్ఈఎల్ నిర్మిస్తోంది.
ప్లాంటు నిర్మాణంలో అధికశాతం ఫ్యాబ్రికేటెడ్(వస్తువులను బిగించడం) పనులు ఉంటాయి. ఈ క్రమంలో మూడేళ్ల నుంచి ఇక్కడకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విడిభాగాలు దిగుమతి అవుతున్నాయి. విద్యుత్ కేంద్రం నిర్మాణంలో కీలకమైన 5 బాయిలర్లలో సివిల్ పనులు పూర్తికాగా ప్రస్తుతం ఫ్యాబ్రికేటెడ్ పనులు జరుగుతున్నాయి. వీటికి సమాంతరంగా పొగగొట్టాల నిర్మాణం, కూలింగ్ టవర్లు, నీటిశుద్ధి ప్లాంటు, బొగ్గు దిగుమతి, తరలింపునకు ప్లాంటు నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్లాంటు నీటి అవసరాలకు 3.1 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మిస్తున్నారు. 60 శాతం పనులు పూర్తికావచ్చాయి.
త్వరలోనే టెండర్లు
సమీపంలోని విష్ణుపురం రైల్వేస్టేషన్ నుంచి ప్లాంటు వరకు సుమారు 8 కిలోమీటర్ల దూరం రెండు లైన్లతో రైలుమార్గం పనులకు త్వరలోనే టెండర్లు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. కృష్ణపట్నం, సింగరేణి తదితర ప్రాంతాల నుంచి బొగ్గును తరలించడానికి ప్లాంటు వద్ద 14 రైల్వేలైన్లను ఏర్పాటు చేయనున్నారు. కృష్ణానది నుంచి ఇక్కడ నిర్మిస్తున్న జలాశయంలోకి నీటిని తరలించడానికి పైప్లైన్ పనులకు సైతం త్వరలోనే టెండర్లు ఖరారు కానున్నాయని తెలిసింది. 450 ఎకరాలలో నిర్మించనున్న యాష్పాండ్ (బూడిదనిల్వ) పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంది.
అత్యాధునిక యంత్రాల సాయంతో..
ప్లాంటు పనుల వేగవంతానికి టీ జెన్కో 250 మంది ఇంజినీర్లను ఇటీవలే నియమించింది. ఒక సీఈతో ఐదుగురు ఎస్ఈ, ఈఈలతో పాటూ 37 మంది డీఈఈలు, 50 మంది ఏడీఈ, దాదాపు 100 మంది ఏఈలు, ఇతరత్రా సిబ్బంది నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక, యంత్రాలతో ప్లాంటులో ప్రస్తుతం పనులు సాగుతున్నాయి. 600 టన్నుల బరువును ఎత్తే భారీ క్రేన్లను వాడుతున్నారు. భవిష్యత్తులో ఇక్కడికి రైల్వే వ్యాగన్లలో వచ్చే బొగ్గును సులభంగా దిగుమతి చేసుకోవడానికి వీలవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. 2022 చివరికల్లా తొలి ప్లాంటు ప్రారంభించేలా పనులు సాగుతున్నాయని ప్లాంటు ఈఈ బుచ్చయ్య వెల్లడించారు.
![](https://assets.eenadu.net/article_img/ghmain-19b_6.jpg)