Modala Mallesh: నల్లొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన మోదాల మల్లేష్కు కాకతీయ వర్శిటీ డాక్టరేట్ ప్రకటించింది. జంతుశాస్త్ర విభాగంలో చేసిన పరిశోధనగానూ ఈ గౌరవం లభించింది. ఆయనకు ప్రముఖ విద్యావేత్తగా, పోటీ పరీక్షల నిపుణుడిగా పేరుంది.
పత్తి రైతులకు ఎంతో ఉపయోగం..
కాకతీయ విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగం సహాయ ఆచార్యురాలు డాక్టర్ చింత స్రవంతి పర్యవేక్షణలో మోదాల మల్లేష్ పరిశోధన చేశారు. 'సీజనల్ డైవర్సిటీ ఆఫ్ పెస్ట్స్ అండ్ ప్రిడేటర్స్ ఇన్ బీటీ అండ్ నాన్ బీటీ కాటన్ ఫీల్డ్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్' అనే అంశంపై పరిశోధించారు. ఈ పరిశోధన ముఖ్యంగా పత్తి రైతు, పెస్టిసైడ్ కంపెనీలకు ఎంతో ఉపయోగపడుతుందని అధ్యాపకులు తెలిపారు. ఈ పరిశోధన కాలంలో ఆయన రాసిన ఐదు వ్యాసాలు.. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి.
పేద విద్యార్థులకు అండగా మల్లేష్..
ఓవైపు చదువులో రాణిస్తూనే.. పది మందికి అండగా ఉంటున్నారు మల్లేష్. 2009 నుంచి పలు వర్శిటీలు నిర్వహించే పీజీ ప్రవేశ పరీక్షల(జంతు శాస్త్రం)కు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. గ్రూప్ - 1, 2 తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం.. వివిధ దినపత్రికల్లో వందల సంఖ్యలో విద్యా సంబంధిత ఆర్టికల్స్ రాశారు.
విద్యా ప్రస్థానం..
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. డాక్టర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి సీపీఎఫ్ఎన్ను పొందారు. గతంలో నకిరేకల్, సూర్యాపేటలోని పలు డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుడిగా పని చేశారు. ప్రస్తుతం నకిరేకల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ లెక్చరర్గా (గెస్ట్ ఫ్యాకల్టీ) విధులు నిర్వర్తిస్తున్నారు. మల్లేష్కు డాక్టరేట్ రావడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కళాశాల సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
'కాకతీయ వర్శిటీ నుంచి డాక్టరేట్ పొందటం ఆనందంగా ఉంది. నా పరిశోధనకు సహకరించిన ఫ్రొఫెసర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో పేద విద్యార్థుల కోసం.. మరిన్ని ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తాను.
- మోదాల మల్లేష్, ప్రముఖ విద్యావేత్త(పాలెం, నల్గొండ జిల్లా)
ఇదీ చూడండి: Harish rao letter to central: 'రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించండి'