అత్యధిక దిగుబడులిచ్చే సన్నరకాలంటూ ప్రచారం చేసి నాసిరకం విత్తనాలు రైతులకు కట్టబెట్టి వేల ఎకరాల్లో పంట నష్టానికి కారణమైన కంపెనీపై అన్నదాతలు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాసిరకం విత్తనాల వల్ల నాలుగు వేల ఎకరాలకు పైగా పంటనష్టం వాటిల్లింది.
కథనాలపై స్పందన
ఈ సమస్యను ఈటీవీ-ఈనాడు గత మార్చిలో వెలుగులోకి తెచ్చింది. స్పందించిన శాస్త్రవేత్తలు, అధికారులు విత్తనాల్లో లోపాలున్నట్లు తేల్చారు. విత్తన తయారీదారులతో పాటు డీలర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. గరిడేపల్లి, నేరెడుచర్ల, పాలకీడు, హుజూర్నగర్ మండలాలకు చెందిన ఐదు దుకాణాల లైసెన్సులు 1983 విత్తన నియంత్రణ ఉత్తర్వు సెక్షన్ 89 (ఏ) ప్రకారం రద్దు చేశారు. కంపెనీకి కూడా నోటీసులు జారీచేశారు.
ఎంతకాలం తిరగాలి
ఇంతవరకు బాగానే ఉంది. రైతులకు న్యాయం చేసేందుకు మాత్రం అధికారులు తాత్సారం చేస్తున్నారు. జరిగిన నష్టంపై వ్యవసాయాధికారులు పంటలు పరిశీలించి నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక ఇచ్చేందుకు రైతులను ఇప్పటికీ ముప్పుతిప్పలు పెడుతున్నారు. వాటి కోసం అన్నదాతలు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పట్టించుకోని అధికారుల తీరుతో విగిసిపోయి న్యాయపోరాటమే శరణ్యమనుకున్నారు. నాసిరంకం విత్తనాలతో సుమారు 20 గ్రామాల్లో బాధిత రైతులు ఉన్నారు.
ఇక్కడైనా న్యాయం జరగాలి
కేవలం పాలకీడు మండలం యల్లాపురంలో మాత్రమే నివేదిక ఇచ్చారు. దీనిని ఆధారం చేసుకుని వినియోగదారుల ఫోరంతో పాటు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కేసువేసేందుకు కర్షకులు సిద్ధమవుతున్నారు.