కరోనా కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు అమాంతం పెంచి ప్రజలను దోచుకుంటోందని నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు వంశీ కృష్ణ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ధర్నా చేపట్టామని నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ తెలిపారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత.. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు గత 20 రోజులుగా చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు.. చమురు ధరలు పెరుగుతాయని, తగ్గినప్పుడు.. ధరలు తగ్గుతాయని మోదీ చెప్పారని వంశీకృష్ణ గుర్తు చేశారు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో తగ్గినా.. కేంద్రం ఎందుకు పెంచుతూ పోతోందో చెప్పాలని ప్రశ్నించారు.
ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్