ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొవిడ్ సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఏఎస్పీ పోతరాజు సాయి చైతన్య, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి సంయుక్తంగా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆసుపత్రికి వచ్చే ప్రజల సహాయార్థం ప్రతిరోజు 24 గంటల పాటు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తారు.
వారు ప్రతిరోజు వైద్య సిబ్బంది సలహాలు తీసుకుని వాటిని కరోనా వ్యాధిగ్రస్థులకు తెలియజేస్తారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్, కొవిడ్ వార్డుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆసుపత్రికి వచ్చే ప్రజలకు సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో ఎ.అప్పయ్య, సీఐ జి.శ్రీధర్, ఎస్ఐ బి.ఓంకార్ యాదవ్, ఫణి, వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 4,826 కరోనా కేసులు.. 32 మరణాలు