కరోనా నేపథ్యంలో మధ్య తరగతి కుటుంబాలు కొనలేనంతగా కూరగాయల ధరలు పైపైకే ఎగిసిపడుతున్నాయి. సంచిలోనే కుతకుత ఉడుకుతున్న కూరగాయలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. కొవిడ్-19 ప్రభావంతో ఉపాధి లేక అవస్థ పడుతున్న నిరుపేదలకు పెరిగిన ధరలు శాపంలా పరిణమించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూరగాయల సాగు నామమాత్రం కావడంతో ప్రధాన నగరాలు, పట్టణాలు ఎగుమవుతులపైనే ఆధార పడతాయి. ఇది చాలదన్నట్లు స్థానిక రైతులు కొద్దోగొప్పో పండించే కూరగాయలు మొన్నటి వర్షాలకు పూర్తిగా దెబ్బతినడంతో ధరలకు రెక్కలొచ్చినట్లయింది.
ఆకు కూరలదీ ఇదే బాట: స్థానికంగా పండించే ఆకుకూరలు సైతం కొనలేని దుస్థితి దాపురించింది. తోటకూర-రూ.110, పాలకూర-రూ.120, గోంగూర కట్ట రూ.10కు లభ్యమవుతుంది. సైజుతో నిమిత్తం లేకుండా ఒక మునగకాయ రూ.10 పలుకుతోంది. నాలుగైదు రకాల కూరగాయలు తీసుకుంటే ఇంతకు ముందైతే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కొంత ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు అడిగితే మనిషిని ఎగాదిగా చూస్తున్నారు. స్థానిక రైతులు పండించే బెండకాయ, బీరకాయ, కాకరకాయ, గోరుచిక్కుడు, దొండకాయ తోటలు వర్షాలకు నీరు చేరి దెబ్బతినడంతో వీటి దిగుమతులపై ఆధార పడక తప్పడం లేదు. ఈ ధరలు ఇప్పట్లో దిగిరాకుంటే సామాన్యుడి నిత్యజీవనం మరింత దుర్భరం కానుంది.
ఇదీ చూడండి: అంతా సిద్ధం: నేటి నుంచి శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు