కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో ఒకనాడు రాజఠీవి ప్రదర్శించిన వీర్లగడి కాలంతో పాటు... మార్పులు సంతరించుకున్నాయి. ఇప్పుడు ఆ స్థలం ఆహ్లాదం పంచే పార్కుగా మారింది. సుమారు 400 సంవత్సరాల క్రితం వీర్లయావారావు నిర్మించిన వీర్లగడి రాజరికపు ప్రతీకగా నిలిచింది. వెలిచాల ప్రాంతాన్ని పరిపాలించిన వీర్ల యావారావు అనంతరకాలంలో ఈ పురాతన కోట నిరుపయోగమైంది. గ్రామస్థులు కోటలోనికి వెళ్లేందుకు భయపడేవారు. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరుకున్న వీర్లగడి కూలిపోయింది.
ఇటివలే గ్రామస్థులు ఈ స్థలాన్ని పార్కుగా మార్చారు. పూల మొక్కలు, పచ్చగడ్డి పరిచి ఆహ్లాదభరితంగా చేశారు. మరికొంత భాగాన్ని పెద్దల వ్యాయామానికి ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకునేందుకు ఊయలలు ఏర్పాటు చేశారు. వీర్లగడి కాలంతో పాటు.. మార్పు చెంది పార్క్ రూపంలో పల్లె ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
ఇవీ చూడండి: నాకోసం ఎదురు చూసేవాళ్లే గుర్తొస్తుంటారు..!