కరోనా అడ్డుకట్టకు టీకాయే ఏకైక మార్గమని చెప్పడంతో వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. టీకా కేంద్రాలకు జనం పరుగులు పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారి సంఖ్యనే ఎక్కువ. రెండో డోసు కోసం కొవిషీల్డ్ తీసుకున్న వారు 12 వారాల తర్వాత రావాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. ప్రస్తుతం ఆ గడువు పూర్తి అయిన వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరూ లేరని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.
మరోవైపు కొవాగ్జిన్ రెండో డోసు నాలుగు వారాల అనంతరం తీసుకోవాలనే నిబంధన ఉంది. ఈ టీకా గడువేమి పెరగక పోవడంతో ఆ టీకా తీసుకున్న వారిలో గందరగోళం నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారు… రెండో డోసు పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 2లక్షల335 మంది కొవిషీల్డ్ టీకా తీసుకోగా… కొవాగ్జిన్ తీసుకున్నవారి సంఖ్య 17,186మంది. కొవాగ్జిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత 28వ రోజు రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. గడువు దాటితే మళ్లీ మొదటి డోసు తీసుకోవాలా.. ఆలస్యమైనా నష్టం లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొవిషీల్డ్ 12 వారాల గడువు పూర్తి చేసుకున్నవారు లేనందున రెండో డోసు టీకా రద్దు చేశామని… కొవాగ్జిన్ మాత్రం యథావిధిగా ఉంటుందని ప్రకటించారు. ఆ తర్వాత స్టాక్ లేనందువల్ల కొవాగ్జిన్ రెండో డోసును నిలిపివేసినట్లు వెల్లడించారు. మళ్లీ ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
ఆలస్యమైనా నష్టం ఉండదు..
కొవాగ్జిన్ రెండో డోసు వారం ఆలస్యమైనా ఎలాంటి నష్టం ఉండదు. ప్రస్తుతం కొవిషీల్డ్ రెండో డోసు తీసుకోవాల్సిన వారు జిల్లాలో లేరు. కొవాగ్జిన్ మొదటి డోసు ఎక్కడ తీసుకున్నారో… రెండో డోసు ఆయా కేంద్రాల్లోనే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తాం. స్టాక్ లేనందున కొవాగ్జిన్ రెండో డోసు ప్రారంభించలేదు. ఆలస్యమైతే టీకా పని చేయదనేది అపోహ.-డాక్టర్ జువేరియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి
ఇదీ చదవండి: కరోనా మృత్యుకేళి- ఒక్కరోజే 4,329మంది బలి