కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వార్షిక తనిఖీపై ప్రజావేదిక నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నివేదికలు తనిఖీ చేశారు. అధికారులు సరిగా ప్రచారం చేయకపోవడం వల్ల ప్రజలు హాజరు కాలేదు. కేవలం ఆడిట్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు మాత్రమే పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులపై ఆడిటర్ల అభ్యంతరాలు వేదికపై ప్రకటించి క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. మండల వ్యాప్తంగా 11 విడతల్లో 11 లక్షల రూపాయల రికవరీకి ఆదేశించినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి తెలిపారు. 12వ విడతలో వెల్లడైన అవకతవకలపై చర్యలు తీసుకుంటామని సభలో ప్రకటించారు.
మొక్కల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణ పనుల్లో జాప్యంపై అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ మంజులా దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలకు వంద రోజులు పని కల్పించని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం చూపితే చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండి: దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ 'ఈటీవీ భారత్'