తల్లిదండ్రుల అకాల మరణంతో అనాథగా మారిన ఓ యువతికి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అండగా నిలిచారు. ఆమెకు ఇంటిని నిర్మించడంతో పాటుగా ఉన్నత చదవులు చదవించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కరీంనగర్ జిల్లా పచ్చునూరు గ్రామానికి చెందిన లింగయ్య- పూలమ్మ దంపతులకు కుమార్తె ఉంది. పూలమ్మ అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతిచెందింది. బిడ్డ బాధ్యతలు చూసుకుంటున్న లింగయ్య కూడా... ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు. ఒకే బిడ్డ కావటంతో ప్రియాంకే తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది.
తల్లిదండ్రుల మృతితో అనాథగా మారిన యువతి చదువు మానేసి, కూలీ పనులకు వెళ్తోంది. గ్రామంలోని తెరాస నాయకుల సమాచారంతో పచ్చునూరుకు వెళ్లిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్... ప్రియాంకను ఓదార్చారు. యువతికి అన్ని విధాలుగా అండగా ఉంటామని... ఆమెకు ఇంటి నిర్మాణంతో పాటు ఉన్నత చదువుల బాధ్యతలు తీసుకుంటానని భరోసానిచ్చారు.
ఇదీ చదవండి: పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎర్రబెల్లి