కరోనా కోరల నుంచి కరీంనగర్ కుదుటపడింది. 26 రోజులుగా ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడం వల్ల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వైరస్ కట్టడికి అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేశారు. జిల్లా ప్రజలు వారికి సహకారమందించారు. ప్రధానంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖతోపాటు పోలీసులు రేయింబవళ్లు శ్రమించడంతో మంచి ఫలితాలు కనిపించాయి. ప్రస్తుతం ఆరెంజ్ జోన్లో ఉన్న జిల్లాలో ఇటీవల ఆంక్షల సడలింపులతో కొత్త పంథా కనిపిస్తోంది. ప్రజలు జాగ్రత్తల్ని పాటిస్తూనే రోజూవారీగా దినచర్యల్ని కొనసాగిస్తున్నారు.
‘త్వరలో మరికొన్ని జిల్లాలు గ్రీన్జోన్ పరిధిలోకి రానున్నాయి. కొత్తగా కరోనా కేసులు లేకపోవడంతో ఆరెంజ్ జోన్లు కాస్తా.. నిర్ణీత వ్యవధి దాటిన తరువాత గ్రీన్జోన్లుగా మారనున్నాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం.’
- ఇటీవల విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
26 రోజులు దాటింది..!
26 రోజులుగా జిల్లాలో పాజిటివ్ కేసులు రాకపోవడంతో వైద్యఆరోగ్య వర్గాలతోపాటు ప్రజలు ఊపిరి పీీల్చుకుంటున్నారు. కరోనా కట్టడి విషయంలో అధికార యంత్రాంగం పక్కాగా ప్రణాళికల్ని ఆచరణలో చూపించడం వల్లనే మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. 21 రోజులపాటు పాజిటివ్ కేసు నమోదు కాని జిల్లాలను గ్రీన్జోన్గా కేంద్రం గుర్తించనుంది. ఇందులో భాగంగానే కరీంనగర్ జిల్లా కూడా కేంద్రం ఆమోదం తెలిపితే త్వరలోనే గ్రీన్జోన్ పరిధిలోకి రానుంది.
ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం గత కొన్ని రోజులుగా కొత్తగా కేసులు నమోదవని జిల్లాల పేర్లను పేర్కొంటూ గ్రీన్జోన్ పరిధిలోకి మార్చాలనే ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ కూడా ఇటీవల ప్రస్తావించారు. జిల్లా పాలనాధికారితోపాటు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా కేంద్రం ప్రకటనపై ఆశలతో ఉన్నారు. అయినా జిల్లా ప్రజల్ని ఎప్పటికప్పుడూ జాగ్రత్తగా ఉండాలనేలా అధికారులు సూచనలు చేస్తున్నారు.
![](https://assets.eenadu.net/article_img/11KR4021.jpg)
శరవేగంగా స్పందిస్తూ..
జిల్లాలో తక్షణ చర్యల్ని తీసుకోవడం, పక్కా వ్యూహంతో వ్యవహరించడంలో జిల్లా యంత్రాంగం ముందు వరుసలో నిలిచింది. ఇలా ఇప్పటివరకు మొత్తంగా 558 మంది నమూనాలను తీసుకున్నారు. ఇందులో మొత్తంగా 19 పాజిటివ్ కేసులు రాగా.. అందరికీ నెగెటివ్ వచ్చి డిశ్చార్జి అయ్యారు.
ఇటీవల జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన ఓ వృద్ధుడికి పాజిటివ్ రావడం.. అతనికి కరీంనగర్ సమీపంలోని ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాథమికంగా కలిసిన వారి నమూనాలను పంపించగా అందరికి నెగెటివ్ వచ్చింది. ఈ నెల 29 వరకు లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్ని మాత్రం జిల్లా యంత్రాంగం కొనసాగిస్తూనే ఉంది.
- 1,51,393 ఇంటింటి వైద్య పరీక్షల్ని అందుకున్నవారు
- 7 కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు
- 473 టెలీ మెడిసిన్ సేవలు పొందినవారు
- 19 మొత్తంగా పాజిటివ్ వచ్చినవి
- 558 మొత్తం సేకరించిన నమూనాలు
- 174 మొత్తంగా ఐసోలేషన్లో ఉన్నవారు
- 19 పాజిటివ్ కాస్తా నెగెటివ్గా మారినవి
- 0 ప్రస్తుతం ఉన్న పాజిటివ్ కేసులు