కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఏరడపల్లికి చెందిన రమేష్-శారద దంపతులకు అభినయ, ఆలయ ఇద్దరు కుమార్తెలు. అనారోగ్య కారణాలతో ఆరు నెలల వ్యవధిలో తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. వారి ఆలన పాలన చూసేవారు లేరు. చెల్లికి అక్కే అమ్మలా మారింది. వారి దయనీయ పరిస్థితిపై ఈటీవీలో "పాపం పసివాళ్లు' అనే పేరుతో కథనం ప్రచురితమైంది. ఆ కథనానికి అధికార యంత్రాంగంతోపాటు పలువురు ప్రవాస భారతీయులు స్పందించారు.
నిత్యావసరాలు
హుజూరాబాద్ ఆర్డీవో బెన్ షలోమ్, సీఐ కిరణ్, తహశీల్దార్ బావుసింగ్లు నిత్యావసర వస్తువులతోపాటు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. వారి దయనీయ పరిస్థితిని గమనించిన చొప్పదండికి చెందిన న్యాలపట్ల శేఖర్గౌడ్ న్యూజిలాండ్లో నివాసముంటున్నాడు. స్థానికుల నుంచి వీరి పరిస్థితిని తెలుసుకున్నాడు. రూ.30వేల నగదు ఆర్థిక సహయాన్ని అందించేందుకు ముందుకు వచ్చాడు.
ఇతర నాయకులు
తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, చొప్పదండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్ ఇతర నాయకులు ఏరడపల్లిలో చిన్నారుల ఇంటికి వచ్చారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ.30 వేల నగదును చిన్నారులకు అందించారు. చిన్నారులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సత్యం, నాయకులు రామక్రిష్ణ, శ్రీనివాస్ గౌడ్, కొండల్, సత్యం, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'శ్రీశైలం ఘటనపై కమిటీ వేశాం.. కుటుంబాలకు అండగా ఉంటాం'