కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరెంజ్ జోన్లో ఉన్న జిల్లాలు 21 రోజుల పాటు కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాకుంటే గ్రీన్ జోన్ పరిధిలోకి చేర్చనున్నారు. కామారెడ్డి జిల్లాలో గత 20 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. మరో రెండు రోజుల్లో కరోనా రహిత జిల్లాగా ప్రకటించి గ్రీన్జోన్ పరిధిలోకి చేర్చనున్నారు.
వలస కార్మికుల వివరాలు నమోదు...
కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతిచ్చిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే వలస కార్మికులపై ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా వలస కార్మికుల వివరాలను నమోదు చేసే బాధ్యతను పోలీసులతో పాటు రెవెన్యూ, వైద్య శాఖ సిబ్బందికి అప్పగించారు. టీఎస్ కరోనా ట్రాకర్ అనే యాప్లో వలస కార్మికుల పూర్తివివరాలు నమోదు చేసి వారు ఇంట్లోనే 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్దేశించనున్నారు.
బాన్సువాడ పట్టణంలో...
బాన్సువాడ పట్టణంలో రెడ్జోన్ పరిధిలో ఉన్న రెండు కాలనీల్లో ఇవాళ వైద్యశాఖ అధికారులు ఇంటింటా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పట్టణంలో అనుమానిత లక్షణాలున్న వారికి సైతం ఆరోగ్య పరీక్షలు చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నారు.
పల్లెల్లో సడలింపులపై పర్యవేక్షణ...
రెండు రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో పరిశ్రమలతో పాటు చిన్నచిన్న దుకాణాలు నిర్వహించుకునేందుకు కొన్ని సడలింపులిచ్చింది. వీటిని ఉల్లంఘించకుండా పక్కాగా పర్యవేక్షణ చేయాలని జిల్లా యంత్రాంగానికి పాలనాధికారి శరత్ ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో ఉన్న వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు అనుమతులు మంజూరు చేస్తున్నారు.
జిల్లాలో కార్యాచరణ...
- ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు 12
- పూర్తిగా కోలుకొని డిశ్ఛార్జి అయిన వారు 10
- గాంధీలో చికిత్స పొందుతున్న వారు 2