జోగులాంబ గద్వాల జిల్లా గూడెందొడ్డి జలాశయం ఎడమకాల్వ గేట్లను ఎత్తడం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఒక టీఎంసీ సామర్థ్యంతో గూడెందొడ్డి జలాశయాన్ని నిర్మించారు. అక్కడి నుంచి 73 కిలోమీటర్ల మేర ఎడమ కాల్వను నిర్మించి ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. కానీ, పనులు ఇంకా పూర్తి కాలేదు. ప్రతి ఏటా జలాశయం నిండినప్పుడల్లా... కొద్దిమేర గేట్లు ఎత్తి ఎడమ కాల్వ ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. సుమారు 10 కిలోమీటర్ల మేర రైతులు నీళ్లు పారించుకుంటున్నారు. ఈ ఏడాది గేట్లు ఎత్తేందుకు చేసిన ప్రయత్నం తిప్పికొట్టింది. సామర్థ్యానికి మించిన వరదతో గేట్లు తెరుచుకోగా.... మళ్లీ మూసివేయటానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఫలితంగా కాల్వకు గండి పడింది.
సామర్థ్యానికి మించి
జలాశయం నిండటంతో అధికారులు ఈ నెల 15న సాగునీటి కోసం ఎడమ కాల్వ గేట్లను ఎత్తారు. కాల్వ సామర్ధ్యం 500 క్యూసెక్కులు కాగా అంతకుమించిన వరదతో గేట్లు తెరచుకున్నాయి. లెక్కకు మించి వరద పారుతుండటంతో.. మళ్లీ గేట్లు మూసేందుకు ప్రయత్నించారు. సాంకేతికలోపంతో గేట్లు మూసుకోకపోవటంతో.. వరద ఉద్ధృతికి కాల్వకు గండి పడింది. సుమారు 200 ఎకరాలు నీట మునిగాయి. సాగు చేసుకుంటున్న పంట మునిగిపోవటంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
నీళ్లు ఎక్కువగా వదలడంతో ఒకేసారి కాల్వకు గండి పడింది. కాల్వ కింద ఉన్న పంట చేలన్నీ కొట్టుకుపోయాయి. పంటనష్టం కంటే ఆస్తినష్టమే ఎక్కువ వాటిల్లింది. మూడు రోజులుగా ప్రయత్నించినా వరద ప్రవాహాన్ని ఆపలేకపోయాం -నర్సింహులు, గూడెందొడ్డి
వందలాది రైతులకు సంబంధించిన సారవంతమైన భూములన్నీ కొట్టుకుపోయాయి. బోర్లు, పొలాలన్నీ నాశనమయ్యాయి. 50 నుంచి 60 లక్షల రూపాయల ఆస్తినష్టం సంభవించింది. - ఆంజనేయులు, గూడెందొడ్డి
మళ్లీ జలాశయానికే
3రోజుల పాటు గేట్లు మూసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వరద నీటికి అడ్డుకట్ట వేయటానికి స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తాత్కాలికంగా రాళ్లు, మట్టి వేయించారు. అయినా... గేట్ల ద్వారా భారీగా నీరు బయటకు వస్తోంది. లీకేజీ నీటిని అప్రోచ్ కెనాల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మళ్లీ ఆ నీటినే జలాశయంలోకి పంపింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎడమకాల్వకు నీరు విడుదల చేసే గేట్లు... ఇప్పటికీ గుత్తేదారు సంస్థ అధీనంలోనే ఉన్నాయి. నీటి పారుదలశాఖకు అప్పగించలేదు. నిర్వహణ లోపం కారణంగా కొన్నిసార్లు సకాలంలో మూసుకోకపోవడంతో నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. వీలైనంత త్వరగా గేట్లకు మరమ్మతులు పూర్తి చేస్తామని.... నీటిపారుదల శాఖ ఈఈ రహీముద్దీన్ తెలిపారు.
పంటసాగు కోసం రైతుల కోరిక మేరకు నీటిని వదిలాం. ఈ నెల 15న ఉదయం రిజర్వాయర్ గేట్లు తెరిచి. మరుసటి రోజు వర్షాలు పడే సూచన ఉండటంతో గేట్లు మూసేందుకు మా సిబ్బంది ప్రయత్నించారు. కెనాల్ పూర్తి కాకపోవడంతో సాంకేతిక సమస్య తలెత్తి.. గేట్లు మూసేయడానికి వీలు కాలేదు. చాలా వరకు నీటి ప్రవాహం ఆపాం. త్వరలోనే గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేస్తాం. -రహీముద్దీన్, నీటి పారుదల ఈఈ
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నెట్టెంపాడు పరిధిలోని కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: LRS: ఎల్ఆర్ఎస్ లేఅవుట్ల పరిశీలనకు ప్రభుత్వం మార్గదర్శకాలు