నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు చేసిన ధాన్యం, మొక్కజొన్న నిల్వలను వెంటనే గోదాములకు తరలించాలంటూ.. రైతులు ఆందోళన నిర్వహించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు.
నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తెచ్చిన ధాన్యం, మొక్కజొన్నను కొనుగోలు చేయటం లేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలకు వాహనాలు రాకపోవడం వల్ల తాము తీసుకొచ్చిన ధాన్యం వానకు తడుస్తోందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగినన్ని వాహనాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.