రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెలువడిన వెంటనే మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఛైర్మన్ల ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అఖిల పక్షం విజ్ఞప్తి చేసింది. లేనిచో లెక్కింపు వాయిదా వేయాలని కోరింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతృత్వంలో అఖిల పక్షం నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిశారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, మర్రి శశిధర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, కోదండరెడ్డి, నిరంజన్, తెదేపా నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ నుంచి రాష్ట్ర సహయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, న్యూడెమోక్రసీ గోవర్ధన్, తెజస ప్రతినిధి పీఎల్ విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 27న లెక్కింపు ప్రక్రియ పూర్తిచేసి...జూలై 5న మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఛైర్మన్లను ఎన్నుకుంటే 40 రోజుల అధిక సమయం ఉండడం వల్ల రాజకీయ ప్రలోభాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని అఖిల పక్షం నేతలు వివరించారు. కౌంటింగ్ పూర్తైన మూడు రోజుల్లోపే ఎంపీపీ, జిల్లా పరిషత్ ఛైర్మన్లను ఎన్నుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఇవీ చూడండి : రాష్ట్ర ఆవతరణ వేడుకల ఏర్పాట్లపై సీఎం సమీక్ష