దసరా నుంచి ధరణి పోర్టల్ ప్రారంభం, తహసీల్దార్లకు అదనంగా రిజిస్ట్రేషన్ల బాధ్యతల నేపథ్యంలో సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను కలిసిన ట్రెసా ప్రతినిధులు.. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
రెవెన్యూ శాఖలో ఖాళీల భర్తీ, పెరిగిన జిల్లాలు, డివిజన్లు, మండలాలకు అనుగుణంగా పోస్టుల పెంపు, రిజిస్ట్రేషన్ విధుల నేపథ్యంలో అదనపు సిబ్బంది, వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా తీసుకోవడంతో పాటు సంఖ్య పెంపు సహా ఇతర అంశాలను సీఎస్కు వివరించారు. డీఆర్వో పోస్టులను యధాతథంగా కొనసాగించాలని, అదనపు కలెక్టర్ పోస్టుకు జూబ్ ఛార్ట్ రూపొందించాలని కోరారు.
పదోన్నతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, కార్యాలయాల నిర్వహణతో పాటు వాహనాలకు బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వీఆర్ఏల స్కేలు అమలుకు మార్గదర్శకాలు, దీర్ఘకాలికంగా పనిచేస్తోన్న టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లను క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన సీఎస్ సోమేశ్కుమార్.. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.