హుజూర్నగర్లో ఓటమికి తానే బాధ్యుడినని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ప్రకటించారు. గాంధీభవన్లో ఇవాళ మధ్యాహ్నం జరిగిన సమావేశంలో హుజూర్నగర్ ఓటమి, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతోపాటు పలు అంశాలు చర్చకు వచ్చాయి. హుజూర్నగర్ ఉపఎన్నికలో తెరాస పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా... డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసిందని నేతలు వివరించారు. పార్టీపరంగా నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి విజయం కోసం కృషి చేశారని ఉత్తమ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల విషయమై పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలని పీసీసీ అధ్యక్షుడు నాయకులకు సూచించారు. అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు లేని నియోజకవర్గాలకు వెంటనే ఇన్ఛార్జీలను నియమించి... మున్సిపాలిటీ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల ఎంపిక వ్యవహారం చూసుకోవాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్కు బాధ్యతలు అప్పగించారు.
హనుమంతరావు ఆగ్రహం...
పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు పీసీసీ అధ్యక్షుడుకి తెలియకుండా...కొందరు నాయకులు ఎవరికి తోచినట్లు వారు ఎలా చేపడతారని సీనియర్ నేత వి.హనుమంతురావు... రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఆర్సీ కుంతియాను నిలదీశారు. బయట పార్టీల నుంచి వచ్చిన కొందరు పార్టీకి నష్టం కలిగించేటట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొదటి నుంచి పార్టీలోనే ఉన్న తాను చివరి వరకూ పార్టీని వీడనని స్పష్టం చేసినట్లు సమాచారం. తమను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని వీహెచ్ హెచ్చరించారు. పార్టీ సమావేశాలకే పరిమితం కాకుండా..పార్టీలో ఏమి జరుగుతుందో తెలుసుకొని అంతర్గతంగా ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కుంతియాను కోరారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న ఉత్తమ్కుమార్ రెడ్డి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని...ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో రాకుండా చూసుకుంటామని వివరణ ఇవ్వడం వల్ల హనుమంతురావు సంతృప్తి చెందారని తెలుస్తోంది.
ఇదీ చూడండి: ప్రారంభమైన పీసీసీ కోర్ కమిటీ సమావేశం