జేఈఈ మెయిన్ మూడో విడత ఆన్లైన్ పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి. నేడు, ఈ నెల 22, 25, 27 తేదీల్లో జేఈఈ మెయిన్ జరగనుంది. దేశ వ్యాప్తంగా సుమారు 7 లక్షల 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షా 11 వేల మంది హాజరు కానున్నారు.
దేశ వ్యాప్తంగా 334 నగరాల్లో ఒక్కో షిఫ్టులో.. 828 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. రాష్ట్రంలో 11 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో జేఈఈ మెయిన్ కేంద్రాలను సిద్ధం చేశారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్లో మొదటి విడతలో 6 లక్షల 80 వేలు.. మేలో రెండో విడతలో 6 లక్షల 9 వేల మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్ పరీక్ష రాశారు. నాలుగో విడత జేఈఈ మెయిన్ ఆగస్టు 26, 27, 31.. సెప్టెంబరు 1, 2 తేదీల్లో జరగనున్నాయి.
నాలుగో ఎడిషన్ తేదీలో మార్పులు..
జేఈఈ మెయిన్స్-2021 పరీక్షల నాలుగో ఎడిషన్ తేదీలో మార్పులు చేసింది కేంద్ర విద్యాశాఖ. మూడు, నాలుగు ఎడిషన్ల మధ్య నాలుగు వారాల వ్యవధి ఉండేలా చూడాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. దీని ప్రకారం నాలుగో ఎడిషన్ను ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీలలో నిర్వహించనున్నారు. విద్యార్థుల డిమాండ్తో పాటు.. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వారికి తగినంత సమయం ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
ఇది వరకే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జులై 20- 25 వరకు మూడో ఎడిషన్, జులై 27-ఆగస్టు 2 మధ్య నాలుగో ఎడిషన్ నిర్వహించాల్సి ఉంది. మొత్తం 7.32 లక్షల మంది అభ్యర్థులు ఇప్పటికే జేఈఈ(మెయిన్స్)-2021 నాలుగో ఎడిషన్ పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు. ఇప్పుడు దరఖాస్తు గడువును నేటి వరకు పొడిగించింది కేంద్ర విద్యాశాఖ.