విద్యుత్ సంస్థల ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ తుది ఉత్తర్వులను జారీ చేసింది. తాజా ఆదేశాల ప్రకారం 584 మంది ఏపీ సంస్థల ఉద్యోగులను తెలంగాణకు పంపాలన కమిటీ ఆదేశించింది.
చేర్చుకోలేమంటూ ఏపీ పిటిషన్
ఏపీ స్థానికత కలిగిన 1157 మందిని 2015లో తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ చేశారు. వారిని చేర్చుకునేందుకు ఏపీ సంస్థలు నిరాకరించడం వల్ల వారు సుప్రీం కోర్టుకెళ్లారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వివాద పరిష్కారానికి ఓ కమిటీని నియమించింది. ఉద్యోగులను విభజిస్తూ ఈ కమిటీ గత డిసెంబర్లో తొలిసారి ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం 1157లో 655 మందిని ఏపీలో చేర్చుకోవాలని ఆదేశించింది. కానీ ఆ ఆదేశాలను పాటించలేమని ఏపీ సంస్థలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనితో ఉన్నత న్యాయస్థానం మరోసారి సమీక్షించి తుది ఆదేశాలు ఇవ్వమని జస్టిస్ ధర్మాధికారి కమిటీకి సూచించింది.
ఇరువర్గాలకు ఒప్పందం
ఈ నేపథ్యంలో కమిటీ ఇటీవల రెండు రాష్ట్రాల సంస్థల యాజమాన్యాలను దిల్లీకి పిలిపించి మరోసారి విచారణ జరిపింది. డిసెంబరులో జారీచేసిన ఆదేశాల ప్రకారం 655 మందిని ఏపీలో చేర్చుకోవాలని సూచించింది. అంతే సంఖ్యలో ఏపీ సంస్థల నుంచి తెలంగాణకు కొంతమంది ఉద్యోగులను పంపుతామని... వారినీ తెలంగాణలో చేర్చుకోవాలని షరతు విధించింది. ఇప్పటికే 71 మందిని వైద్య కారణాలు, దంపతులనే కారణాలతో ఏపీ నుంచి తెలంగాణలో చేర్చుకున్నారు. మిగిలిన 584 మందిని ఏపీ నుంచి తెలంగాణకు పంపాలని సూచించామని కమిటీ సభ్యులు తెలిపారు.
ఇవీ చదవండి : 4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం