లాక్డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలన్న అంశంపై ప్రభుత్వ వైఖరి తెలపాలని హైకోర్టు ఆదేశించింది. లాక్డౌన్ వల్ల ప్రజలు ఆర్థిక వనరులు కోల్పోయినందున విద్యుత్ బిల్లులు చెల్లించే పరిస్థితిలో లేరని హైకోర్టులో పిల్ దాఖలైంది. న్యాయవాది నరేష్, సమీర్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్.చౌహన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.
కౌంటరు దాఖలు చేయాలి
ఆ అంశంపై రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఎస్పీడీసీఎల్, రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయని వాటిని సవరించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్పై కూడా విచారణ జరిగింది.
6 వేలకు పైగా ఫిర్యాదులు
వినియోగదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా కమిటీ ఉన్నందున తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. శ్లాబులపై అభ్యంతరాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని ధర్మాసనం సూచించింది. రాష్ట్ర విద్యుత్ రెగ్యులేషన్ కమిషన్కు 6,767 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిలో 6,678 పరిష్కరించినట్లు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు.
ఇదీ చూడండి : ప్రతి కార్యకర్త పది మొక్కలు నాటాలి: భాజపా