ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సందర్భంగా విత్తనాల పంపిణీ కోసం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రంగం సిద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల రైతుల సౌకర్యార్థం నాణ్యమైన విత్తనాల పంపిణీ కోసం చేపట్టిన ఈ మేళాల నిర్వహణపై వర్సిటీ ఉపకులపతి డా.వెల్చాల ప్రవీణ్రావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 24న రాజేంద్రనగర్లోని వర్సిటీ ఆడిటోరియం ప్రాంగణంతో పాటు పలాస, వరంగల్, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో ఈ మేళాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాజేంద్రనగర్లో ఒక్క రోజు మాత్రమే విత్తన మేళా కొనసాగనుండగా మిగతా చోట్ల మూడు రోజులపాటు విత్తన మేళాలు నిర్వహణ అనంతరం అన్ని రకాల పంట విత్తనాల విక్రయాలు కొనసాగుతాయని వీసీ అన్నారు. నాసిరకం విత్తనాల బెడద నుంచి రైతులను కాపాడేందుకు అన్ని సంస్థలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధన మండలి అనుబంధ సంస్థల సంచాలకులు, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల అధికారులు, జాతీయ విత్తన సంస్థ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థల అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : మూడో విడత ప్రాదేశిక ఎన్నికలకు సర్వం సిద్ధం