అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యను రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కార్యాయలంలోనే తహసీల్దార్ను సజీవ దహనం చేయడం అత్యంత దారుణ సంఘటనగా డిప్యూటీ కలెక్టర్స్ అసోషియయేషన్, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ నేతలు లచ్చిరెడ్డి, ఎస్.రాములు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. విధి నిర్వహణలో తోటి ఉద్యోగినిని కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు. ప్రతీ రెవెన్యూ ఉద్యోగి ఈ సంఘటనను ఖండించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు వెంటనే విధులు బహిష్కరించి బయటకు వచ్చి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి...
తహసీల్దార్ విజయారెడ్డిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సురేష్ ను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు. తహసీల్దార్ మృతికి రెండు నిముషాలు మౌనం పాటించారు.
ఇవీచూడండి: అబ్దుల్లాపూర్మెట్లో విషాదం... తహసీల్దార్ దారుణ హత్య