లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు భారీగా తగ్గాయి. మూడు వేలకుపైగా పెట్రోల్ పంపుల్లో రోజువారీ జరిగే అమ్మకాల్లో 60 శాతం కూడా జరగలేదు. మూడు వారాలుగా అమలవుతున్న లాక్డౌన్తో నిత్యావసర సరుకులు తరలించే.. వాహనాలు తప్ప మిగితావన్నీ నిలిచిపోయాయి. ఆ ప్రభావం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై పడింది. 2019 ఏప్రిల్ ఒకటి నుంచి 14 వరకు జరిగిన పెట్రోల్, డీజిల్ విక్రయాలతో ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి 14 వరకు జరిగిన అమ్మకాలతో బేరీజు వేసి చూస్తే పెట్రోల్ 63 శాతం, డీజిల్ 64 శాతం తగ్గినట్లు స్పష్టమవుతోంది.
ఈ నెల ఒకటి నుంచి 14 వరకు రెండు వారాలపాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పెట్రోల్ డీజిల్ అమ్మకాలను పరిశీలిస్తే.. 2019 ఏప్రిల్ ఒకటి నుంచి 14 వరకు రెండు వారాల్లో.. 5 కోట్ల 22 లక్షల 3 వేల లీటర్లు పెట్రోల్ అమ్మకాలు జరిగాయి. అదే సమయంలో ఈ నెల ఒకటి నుంచి 14 వరకు కేవలం ఒక కోటి 95 లక్షల 3 వేల లీటర్లు మాత్రమే అమ్ముడు పోయింది. అంటే 3 కోట్ల 27 లక్షల లీటర్లు తగ్గినట్లు చమురు సంస్థల లెక్కలు వెల్లడిస్తున్నాయి. సాధారణ రోజుల కంటే 62.64 శాతం మేర విక్రయాలు పడిపోయాయి.
అదే విధంగా గతేడాది ఇదే నెలలో ఒకటో తేది నుంచి 14 వరకు రెండు వారాల్లో 10 కోట్ల 11 లక్షల 29 వేల లీటర్లు డీజిల్ అమ్ముడు పోయింది. అయితే ఏప్రిల్ ఒకటి నుంచి 14 వరకు కేవలం 3 కోట్ల 67లక్షల 87 వేల లీటర్లు మాత్రమే విక్రయాలు జరిగినట్లు చమురు సంస్థలు తెలిపాయి. అంటే 6 కోట్ల 43 లక్షల 42 వేల లీటర్లు అమ్మకాలు పడిపోయినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే 63.62 శాతం అమ్మకాలు తగ్గాయి. రోజువారీగా జరగాల్సిన విక్రయాలు లేకపోవడం వల్ల పెట్రోల్ పంపుల్లో పని చేసే సిబ్బంది..…ఆటవిడుపు ఆటలు ఆడుతూ కాలయాపన చేస్తున్నారు.
ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత