దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య సికింద్రాబాద్ రైల్ నిలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భద్రత, సరకు రవాణా సమయపాలనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు జనరల్ మేనేజర్ బి.బి. సింగ్, జోన్ ఉన్నతాధికారులు, 6 డివిజన్ల ( సికింద్రాబాద్ , హైదరాబాద్ , విజయవాడ , గుంటూరు , గుంతకల్ ) డీఆర్ఎంలు సమీక్షలో పాల్గొన్నారు. మొదట భద్రతా చర్యలను సమగ్రంగా సమీక్షిస్తూ గజానన్ మాల్య స్టేషన్ యార్డులు, రైల్వే సైడింగ్ ప్రాంగణాల్లో భద్రతకు భరోసా కల్పించే చర్యలను చేపట్టాలన్నారు.
జోన్లో రైలు పట్టాల నిర్వహణ పనులను సమీక్షిస్తూ ఆయన రైలు పట్టాల భద్రతకు భరోసా కల్పించేందుకు ఏర్పర్చిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. రైళ్ల రాకపోకల్లో తలెత్తే సమస్యల గురించి ప్రస్తావిస్తూ ఆయన సాధ్యమైనంత తొందరగా సవరణ చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత వరకు అవసరమైన చోట్ల కాషన్ ఆర్డర్లను తొలగించాలని తద్వారా రైళ్ల రాకపోకల వేగం పెరిగే అవకాశముందన్నారు.
డివిజనల్ రైల్వే మేనేజర్లందరితో బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ల ( బీడీయూ ) నిర్వహణపై సమగ్ర సమీక్ష నిర్వహించిన జీఎం, సరకు రవాణా అభివృద్ధికి వినియోగదారులతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతూ ఉండాలన్నారు. ఆహార ధాన్యాలు, ఎరువులు, వ్యసాయ ఉత్పత్తులు, గ్రానైట్ మొదలైన వాటి లోడింగ్ పై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలను కూడా ఆయన సమీక్షించారు. వినియోగదారులు,వ్యాపారులకు సాధ్యమైనంత మద్దతు ఇస్తుందనే విషయం తెలియజేయాలన్నారు. సరకు రవాణా మెరుగుదల కోసం, రైల్వే కల్పించిన నూతన చొరవలను గురించి వారికి వివరిస్తూ సంస్థ ప్రయోజనం కోసం తోడ్పడాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: కరోనాతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తం