ర్యాపిడ్ కిట్ల కొరతతో కొవిడ్ నిర్ధారణ పరీక్షల లక్ష్యాలు కుదించారు. హైదరాబాద్లోని కింగ్కోఠి ఆస్పత్రి వద్ద కరోనా పరీక్ష కోసం వచ్చి క్యూలో నిల్చోలేక మహిళ అక్కడే నేలపై నిద్రించింది. వందలాది మంది అనుమానితులు దవాఖానాలకు క్యూ కడుతుండగా, పదుల సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారు. సోమవారం నగరంలోని చాలా కేంద్రాల్లో పరీక్షలు జరగలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 248 కేంద్రాల్లో పూర్తిస్థాయిలో పరీక్షలు జరగడం లేదు. ప్రభుత్వం నుంచి లక్ష్యాలు తక్కువ చేసి ఇచ్చినందున దానికి తగ్గట్టుగానే పరీక్షలు చేస్తామని చెప్పి, మిగిలిన వారిని సిబ్బంది తిప్పి పంపుతున్నారు. కేవలం లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేస్తామని, కాంటాక్టులో ఉంటే కూడా చేయమని చెబుతున్నారు. కిట్ల కొరత కారణంగా లక్ష్యాలను కుదించినట్లుగా వైద్యాధికారులు చెబుతున్నారు. దీనివల్ల లక్షణాలు లేని అనుమానితులు కొవిడ్ టెస్ట్ చేయించుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
ప్రైవేటుకు వెళ్లలేక.. నిర్ధరణ జరగక...
చాలా మంది అనుమానితులు పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్టు అయ్యామనో.. ఇంట్లో ఒకరికి పాజిటివ్ వచ్చిందనో పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. దీనికి తగ్గట్టుగా పరీక్షలు చేస్తేనే వైరస్ కట్టడి చేసే వీలుంటుంది. ఒంట్లో లక్షణాలు లేకున్నా, మహమ్మారి అందరికీ వ్యాపిస్తోంది. దీనికితోడు ఇంట్లో ఒకరికి వైరస్ సోకితే అందరికీ సోకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రైవేటు ల్యాబ్లకు వెళ్లలేక పరీక్షలు చేయించుకునేందుకు ప్రభుత్వ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇక్కడా కిట్లు లేవన్న సాకుతో పరీక్షలు జరగడం లేదు. దీనివల్ల ఒంట్లో వైరస్ ఉన్నా, నిర్ధరణ జరగక బహిరంగంగా తిరిగే పరిస్థితి కనిపిస్తోంది.
ఇదీ పరిస్థితి..
* రంగారెడ్డి జిల్లాలో 5500-6000 పరీక్షలు చేసేవారు. తాజాగా లక్ష్యాన్ని 2200 పరీక్షలకు కుదించారు. దీంతో పీహెచ్సీలు, సీహెచ్సీల్లో పరీక్షలు 60-70కు మించి చేయడం లేదు.
* మేడ్చల్ జిల్లాలో గతంలో 4000-4500 టెస్టులు చేసేవారు. ప్రస్తుతం లక్ష్యాన్ని 2400కు కుదించడంతో సోమవారం చాలా కేంద్రాల్లో పరీక్షలు నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది.
* హైదరాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ నిత్యం 10,500-11వేల వరకు పరీక్షలు జరిగేవి. ప్రస్తుతం 6150కు లక్ష్యాన్ని తగ్గించారు.
ఇదీ చూడండి : కొవిడ్ ఎఫెక్ట్: నెలలో 40 మంది టీచర్ల మృతి