రుణం వసూలు, వడ్డీరూపంలో వచ్చే రూ.వేల కోట్ల ఆదాయం బహిర్గతం కాకుండా డిజిటల్ నగదును బదిలీ చేసే పేమెంట్ గేట్వేలు, వర్చువల్ ఖాతాల వ్యవహారాల్లోని లోపాలను యాప్ నిర్వాహకులు గుర్తించి రూ.21 వేల కోట్లను కొల్లగొట్టారు. ఈ సొమ్మంతా ఎక్కడికి వెళ్లిందన్న కోణంలో పోలీసులు పరిశోధన కొనసాగిస్తున్నారు.
జెన్నీఫర్, ల్యాంబోల మాయాజాలం
చైనా సంస్థలు రుణ గ్రహీతలకు రుణాలు ఇవ్వడానికి ఒక పేమెంట్ గేట్వేను ఉపయోగిస్తున్నాయి. కంపెనీల బ్యాంకు ఖాతాల్లోంచి ఈ పేమెంట్ గేట్వే ద్వారా రుణగ్రహీత ఖాతాల్లోకి నగదు బదిలీ అవుతుంది. వారు రుణం చెల్లించినప్పుడు మరో గేట్వే ద్వారా అసలు, వడ్డీ జమ అవుతాయి. ఈ నగదును తమ సంస్థల బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా జెన్నీఫర్, ల్యాంబోలు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. రెండో గేట్వేలో ఉన్న నగదును మళ్లీ మొదటి పేమెంట్ గేట్వే ద్వారా రుణగ్రహీతలకు అప్పులిస్తున్నారు. వీటిని చైనా కంపెనీల వర్చువల్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. దిల్లీలోని రేజర్ పే సంస్థ కొన్ని నెలలుగా చైనా కంపెనీలకు పేమెంట్ గేట్వే సేవలను అందిస్తోంది. రోజుకు రూ.10 కోట్లకు పైగా లావాదేవీలు కొనసాగిస్తున్నా.. రేజర్పే సంస్థ బ్యాంకులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో పూర్తి వివరాలు ఇవ్వాలంటూ రేజర్పే సంస్థకు పోలీసులు తాఖీదులు జారీ చేశారు.
ఆర్బీఐకి సమాచారం ఇవ్వకుండానే..
పూచీకత్తు లేకుండా సులభంగా రుణాలిస్తున్న చైనా సంస్థలు తాము లక్షల మందికి అప్పులిస్తున్నట్టు ఆర్బీఐకి కనీసం సమాచారం ఇవ్వలేదు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థకు రుణ గ్రహీతల వివరాలను చైనా సంస్థల ప్రతినిధులు పంపుతున్నారు. అనంతరం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ద్వారా నాగరాజు బ్యాంకు ఖాతాల్లోకి, అటు నుంచి వర్చువల్ ఖాతాల్లోకి నగదు వెళ్తోంది. వర్చువల్ ఖాతాల్లో కంపెనీల నగదు జమచేయడమే తప్ప తీసుకునే వీలుండదు. ఈ నిబంధనను జెన్నీఫర్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇలా ల్యాంబో, నాగరాజు, కాల్సెంటర్ ఉద్యోగుల సహకారంతో జెన్నీఫర్.. ఆరు నెలల్లో రూ.21 వేల కోట్లను వసూలు చేసింది. పోలీసులు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపడితే మరిన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.