నాబార్డ్ ఛైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన చింతల గోవిందరాజులు తొలిసారిగా మూడు రోజుల పాటు తెలంగాణ పర్యటనకు వచ్చారు. హైదరాబాద్ అబిడ్స్లోని తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని కలిసి సహకార వ్యవస్థ పనితీరు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో కంప్యూటరీకరణపై పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఎపెక్స్ బ్యాంకు పాలకవర్గ సభ్యులతో సుధీర్ఘంగా చర్చించారు.
కంప్యూటరీకరణ, కార్పొరేట్ గవర్నెన్స్, మానవ వనరుల విధానాల్లో ఎపెక్స్ బ్యాంకు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎండీ మురళీధర్ వివరించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో కంప్యూటరీకరణకు సంబంధించి నాబార్డ్ గ్రాంట్ అసిస్టెన్స్ అందించాలని కొండూరి విజ్ఞప్తి చేశారు. సహకార బ్యాంకు పనితీరు, అందిస్తున్న సేవలపై టెస్కాబ్ అధ్యక్షుడు, ఎండీని గోవిందరాజులు ప్రశంసించారు. వ్యాపార స్థాయి మెరుగుపరచుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవలంభించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్రెడ్డి, సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.