రాష్ట్రంలో ఈత వనాల పెంపకమే లక్ష్యంగా పెద్దఎత్తున ఈత, తాటి మొక్కలను నాటాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. దాదాపు 4 వేల గ్రామ పంచాయతీల్లో తాటి, ఈత మొక్కలు నాటడం ద్వారా ఈ వనాలను పెంచాలని మంత్రి సూచించారు.
హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఎక్సైజ్శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 23న నెక్లెస్రోడ్డులో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న నీరా కేఫ్ శంకుస్థాపన పనులపై సమీక్షించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆరో విడత హరితహారంలో భాగంగా ఈత, తాటి మొక్కలను పెద్దఎత్తున నాటాలని మంత్రి ఆదేశించారు. తద్వారా కల్తీ కల్లును అరికట్టవచ్చని తెలిపారు. మొక్కలు నాటే సమయంలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఫొటోలు తీసి తనకు మెయిల్ చేయాలని సూచించారు.
లాక్డౌన్ సమయంలో గుడుంబా తయారీ, అమ్మకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గుడుంబా తయారీ, సరఫరా, అమ్మకం జరగరాదని స్పష్టం చేశారు.
గుడుంబా నియంత్రణలో నల్గొండ, వరంగల్ రూరల్, ఆదిలాబాద్ జిల్లాల్లో తీసుకున్న చర్యల మాదిరిగా ఇతర జిల్లాల్లోనూ తీసుకోవాలని సూచించారు. సమీక్షలో ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: కొవిడ్పై అపోహలొద్దు... వైద్యరంగంలో మూడోస్థానంలో ఉన్నాం: ఈటల