రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నలువైపులా మార్కెట్లు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. కర్ణాటక ఉద్యాన యాత్రలో భాగంగా రెండో రోజు బెంగుళూరు లాల్భాగ్లో ఉద్యాన రైతుల సహకార సంస్థ హాప్ కామ్స్, మదర్ డైరీ, సఫల్ యూనిట్లను మంత్రి నేతృత్వంలోని బృందం సందర్శించింది. తిరుమ్షెట్టిహల్లిలో అభ్యుదయ రైతు ఆనందరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్నీ మంత్రి పరిశీలించారు.
అప్పుడే శ్రమకు తగిన ధర...
శంషాబాద్, వంటిమామిడి, ఇబ్రహీపట్నంలో రైతు సహకార సంస్థ మార్కెట్లు ఏర్పాటు చేసి ఉత్పత్తులు పెరిగినట్లైతే శంషాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు కూరగాయలు, పండ్లు ఎగుమతులకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. అందుకోసం త్వరలో జీఎంఆర్ సంస్థతో సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యాన శాఖ అధికారులకు సూచించారు. దళారీ వ్యవస్థ పోయి రైతులు, వినియోగదారులకు నేరుగా సంబంధాలు ఏర్పడినట్లైతే... అప్పుడే శ్రమకు తగిన గిట్టుబాటు ధరతోపాటు, వినియోగదారులకు సరసమైన ధరలకు పండ్లు, కూరగాయలు నాణ్యమైనవి అందుతాయని మంత్రి అన్నారు.
విప్లవాత్మకమైన మార్పులు...
కర్నూలు - హైదరాబాద్ జాతీయ రహదారిపై అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్ ఎగుమతి యూనిట్ ఏర్పాటు చేసినట్లైతే... ప్రభుత్వపరంగా తాము సహకారం అందిస్తామని కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిపాదించారు. మదర్ డైరీ, సఫల్ యూనిట్ల ఉత్పత్తులు ఎంతో బాగున్నాయని కితాబు ఇచ్చారు. తెలంగాణలో ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేసి రైతులతో నేరుగా సంస్థలే సంబంధాలు జరపాలని తెలిపారు. ఆ ఉద్దేశంతోనే బీచుపల్లిలో వేరుశనగ నూనె ఉత్పత్తి కేంద్రం, అశ్వారావుపేటలో ముడి ఆయిల్ పామ్ ఉత్పత్తి కోసం ఆదేశాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి కేంద్రాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ఉన్నారన్న నిరంజన్రెడ్డి... రైతుబంధు సమితిలు, రైతు వేదికలతో తెలంగాణ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: పోలీసులు, పరిశ్రమలకు వారధిగా ఎస్సీఎస్సీ: హోం మంత్రి