శాంతిభద్రతల పటిష్ఠం, ప్రజా భద్రత కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో వేల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. నేర పరిశోధనకు అత్యంత కీలకంగా మారిన సీసీ కెమెరాలను ఒకే చోట నుంచే చూసేందుకు వీలుగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో అత్యాధునిక కమాండ్ కంట్రోల్, డేటా కేంద్రాన్ని బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.
ఏకకాలంలో తెరపై 5 వేల కెమెరాలు
ఈ కేంద్రం ద్వారా తెరపై ఏకకాలంలో 5 వేల కెమెరాలను చూసే అవకాశం ఉంది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా బంజారాహిల్స్లో నిర్మితమవుతున్న జంట పోలీసు టవర్లలో ఏర్పాటు కాబోయే కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సమాంతరంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటయ్యే సీసీ కెమెరాలను అనుసంధానం చేయనున్నారు. ఎల్అండ్టీ సీసీ కెమారాలతోపాటు కమ్యూనిటీ పోలీసింగ్, నేను సైతం ప్రాజెక్టుల కింద పలు కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న వేల కెమెరాలను ఈ కేంద్రం ద్వారా పర్యవేక్షించే వీలుంది.
అనేక ప్రత్యేకతలు..
సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ కేంద్రం, డేటా సెంటర్లో అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ కేంద్రంలో 14 మీటర్ల పొడువు, 4.2 మీటర్ల ఎత్తుతో అర్ధ చంద్రాకారంలో భారీ తెరను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మూడు వరుసల్లో.. ఒక్కో వరుసకు 9 చొప్పున టీవీ తెరలుంటాయి. ఒక్కో టీవీ తెర సామర్థ్యం 70 అంగుళాలు. ఈ భారీ తెర పక్కనే రెండు వైపుల నాలుగేసి టీవీ తెరలు 55 అంగుళాల సామర్థ్యం గలవి ఉంటాయి. ఇరవై సీటర్ సామర్థ్యంతో సీసీ టీవీలను వీక్షించేందుకు కూర్చునే ఏర్పాట్లు చేశారు. కెమెరాలకు సంబంధించిన దృశ్యాలను నెల రోజులపాటు నిక్షిప్తం చేసి ఉంచేలా భారీ సర్వర్లు ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి సర్వర్ల సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది.
అప్రమత్తం చేసే సాంకేతిక పరిజ్ఞానం..
సామాజిక పోలీసింగ్లో భాగంగా కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న సీసీకెమెరాలను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం అధునాతన సాంకేతికతో అందుబాటులోకి రానున్న ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం ప్రాజెక్టులో భాగంగా మూడు కమిషనరేట్లలో కెమెరాలను అమర్చనున్నారు. కూడళ్లలో ట్రాఫిక్ జాం ఏర్పడితే సిబ్బంది ప్రమేయం లేకుండానే సమీప కూడళ్ల నుంచి అటు వైపు వాహనాలను రానివ్వకుండా నియంత్రించి అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. నేను సైతం ప్రాజెక్టులో, మూడు కమిషనరేట్లలో 10 లక్షల సీసీ కెమెరాలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. పలు ప్రాజెక్టుల కింద ఏర్పాటు చేసే లక్షలాది కెమెరాలను ఈ కేంద్రం నుంచే చూస్తారు.
భవిష్యత్తులో ఈ కేంద్రాన్ని డయల్ 100కు అనుసంధానం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యాధునిక సైబరాబాద్ కమాండ్ కంట్రోల్, డేటా కేంద్రాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభిస్తారు. ఇప్పటికే డీజీపీ మహేందర్రెడ్డి కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఇదీ చదవండి: 'విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము'