ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్న దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల కృత్రిమ అవయవాలు తయారు చేస్తున్న స్వచ్ఛంద సంస్థను సందర్శించారు. రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న భగవాన్ మహవీర్ వికలాంగ్ సహాయతా సమితి ప్రసిద్ధి చెందిన "జైపూర్ ఫుట్" ను తయారు చేసి అవసరమైన దివ్యాంగులకు ఉచితంగా అందిస్తోంది. భగవాన్ మహావీర్ బోధనల స్ఫూర్తితో 1975లో స్థాపించి, ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడిపిస్తున్నారు. అధికారుల బృందంతో కలిసి కృత్రిమ అవయవాల తయారీ, పనితీరును మంత్రి పరిశీలించారు. నిర్వాహకులతో సమావేశమై సంస్థ కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
అవయవాల తయారీ మొబైల్ వాహనం అందించండి
దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు, భద్రతకు, సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని కొప్పుల ఈశ్వర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతినెల రూ.3,016 పింఛన్, రూ.90 వేల రూపాయల విలువైన త్రిచక్ర వాహనాలు, వీల్ ఛైర్స్, ల్యాప్టాప్స్, 4జీ స్మార్ట్ ఫోన్లు ఉచితంగా అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాలను తయారీ చేసే మొబైల్ వాహనాన్ని తమ రాష్ట్రానికి కూడా అందజేయాలని మంత్రి కోరగా.. సంస్థ నిర్వాహకులు సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ కింగ్ కోఠిలోని తమ సంస్థకు చెందిన యూనిట్ అభివృద్ధికి చేయూతనివ్వాలని సంస్థ ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పక పరిశీలిస్తుందని కొప్పుల ఈశ్వర్ వారికి హామీనిచ్చారు.