కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్లాక్ 4 మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ నెలాఖరు వరకు పాఠశాలలు ప్రారంభించడానికి అనుమతి లేదని.. ఈనెల 21 తర్వాత ప్రతిరోజు 50 శాతం ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు హాజరయ్యేలా అనుమతించాలని జాక్టో డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదేశాలివ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని జాక్టో, యూయూస్పీసీ ప్రతినిధులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
సెప్టెంబరు 1 నుంచి ఆన్లైన్ తరగతులు మొదలయ్యాయని.. ఇకపై ఉపాధ్యాయులు ఇంటివద్దనుంచైనా విద్యార్థులను పర్యవేక్షణ చేయగలుగుతారని జాక్టో ప్రతినిధులు మంత్రితో చెప్పారు. ఈ వారం రోజుల్లోనే పాఠశాలలకు హాజరైన పలువురు ఉపాధ్యాయులకు కరోనా సోకిందని ఇతర ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారన్నారు. అందువల్ల జీవో 120లోని నిబంధనలను అమలు చేయాలని మంత్రికి విన్నవించారు.
రెండు మూడు రోజుల్లో డిజిటల్ క్లాసులు గాడిన పడతాయని, తదుపరి రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. ఉర్దూ, ఇంగ్లీషు మీడియం క్లాసుల నిర్వహణ, వర్క్ షీట్ల తయారీపై బుధవారం విద్యాశాఖ అధికారులతో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండి: హద్దు మీరిన చైనా- గట్టిగా బదులిచ్చిన భారత్